డార్లింగ్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. వీటన్నింటి మార్కెట్ విలువ సుమారు 3 వేలకు పైగా ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్కు సంబంధించి ఎక్కువగా వినిపించే వార్తలు ఆయన పెళ్లికి సంబంధించినవే. బాహుబలి సినిమా ప్రారంభం అయిన నాటి నుంచి ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. గతంలో అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని జోరుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఈ పెళ్లి వార్తలు కాస్త తగ్గాయి. కానీ గత వారం రోజుల నుంచి ప్రభాస్ ప్రేమ, పెళ్లికి సంబంధించి వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్-కృతి సనన్ల మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఆ దృశ్యాలు చూసిన వారు.. ప్రభాస్, కృతి సనన్ల మధ్య ఏదో నడుస్తుందని భావించారు. ఆ వార్తలకు బలం చేకూర్చే కొన్ని సంఘటనలు తాజాగా చోటు చేసుకున్నాయి. ప్రసుత్తం కృతి సనన్, వరుణ్ ధావన్లు నటించిన బేడియా చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమాను తెలుగులో తోడేలు పేరుతో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్తో ప్రభాస్, కృతి సనన్లు లవ్లో ఉన్నారంటూ వార్తలు తెర మీదకు వచ్చాయి. ప్రస్తుతం కృతి మదిలో ఒకరు ఉన్నారు.. అతడు దీపికతో షూటింగ్ చేస్తున్నాడంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో ప్రభాస్, కృతి ఇద్దరు లవ్లో ఉన్నారని.. త్వరలోనే వివాహం చేసుకుంటారని జోరుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై కృతి సనన్ స్పందించారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది కృతి సనన్. దానిలో తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై ఇలా స్పందించింది.
‘‘ఇది ప్రేమ కాదు… పీఆర్ (పబ్లిసిటీ స్టంట్) అంత కంటే కాదు. మా తోడేలు (వరుణ్ ధావన్) రియాలిటీ షోలో కొంచెం హద్దులు దాటింది. సరదాగా చేసిన వ్యాఖ్యలు పుకార్లకు కారణం అయ్యాయి. ఎవరో ఒకరు నా పెళ్లి తేదీ వెల్లడించే ముందే.. నన్ను అసలు విషయం చెప్పనివ్వండి. ఈ రూమర్స్ అన్నీ నిరాధారమైనవి. ఇవన్ని పుకార్లు’’ అంటూ ఇన్స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. దాంతో ప్రభాస్-కృతి ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలకు ఈ పోస్ట్తో ఫుల్స్టాప్ పడింది.