గత కొన్ని రోజులుగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికల కన్నా ఎక్కువగా హడావుడి సృష్టిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో మేమంతా ఒక్కటే అనే సినీ పెద్దలు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు మాటల యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి జీవిత నటుడు నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లు నరేశ్తో కలిసి ట్రావెల్ చేసి.. ఆయన చెప్పిన మాట వినడమే తప్పు అయిందని జీవిత రాజశేఖర్ బాంబు పేల్చారు. రెండేళ్లు ప్యానెల్లో నరేశ్తో కలిసి పనిచేశానని.. తన పక్కనే ఉండి అన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు జీవిత క్లారిటీ ఇచ్చారు.
‘మా’లో తాను అందరినీ కలుపుకోవాలనే ప్రయత్నం చేయడం.. అందుకోసం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పినా ఆయన మాత్రం పట్టించుకోలేదని అన్నారు. ఒక వేళ అందరినీ పిలిచి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తే తనని దించేస్తారని అపోహలో నరేష్ ఉన్నారని అన్నారు జీవిత. అయితే నరేష్ మోసాలు చేశారని అనను..కానీ మా మద్య విభేదాలు వచ్చాయి. ఒక్కసారి ఎగ్జిక్యూటీవ్ మీటింగ్ పెట్టమని ఎంత చెప్పినా వినలేదని అన్నారు. బేదాభిప్రాయాలు ఉన్నప్పుడు డైరీ లాంచ్ గ్రాండ్ గా చేయొద్దని కోరినా నరేష్ వినలేదని తెలిపారు. డైరీ లాంచ్ లో రాజశేఖర్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఆరోజు రాజశేఖర్ చేసింది తప్పు అన్నట్టుగా చేశారని మండిపడ్డారు. మంచి చేద్దామని ప్రయత్నించి తాను, రాజశేఖర్ పిచ్చోళ్లను అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు జీవిత.
ఇక బండ్ల గణేష్ తనపై ఆరోపణలు చేయడానికి 24 గంటల పాటు మీడియా చానళ్ల చుట్టూ తిరిగారని.. పృథ్వీ కూడా తనపై ఆరోపణలు చేశారన్నారు జీవిత. అయినా, ఈ విషయాలను పక్కన బెట్టి సైలెంట్గా ఉంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఎవరూ లేనట్టుగా మా ఎన్నికల్లో ఎప్పుడూ జీవిత రాజశేఖర్లను టార్గెట్ చేసే అవసరం ఏముంది అంటూ ఆమె ప్రశ్నించారు. మంచి చేయాలనుకోవడమే మేము చేసిన తప్పా అంటూ నిలదీశారు.