మా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పోటీ చేస్తున్న వారిలో టెన్షన్ మొదలైంది. ఈ నెల 10 న ‘మా’ అధ్యక్షులు ఎవరు అన్న విషయం తేలిపోతుంది. కొన్ని రోజులుగా ప్రకాశ్ రాజ్- మంచు విష్ణు ప్యానెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. లోకల్ నినాదం మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది. రెండు ప్యానెల్స్ మధ్య ఆరోపణలు కాస్తా దూషణలపర్వం వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తీవ్రపదజాలంతో తూలనాడుకుంటున్నారు. అందులో భాగంగా ఇతరులను కూడా అన్యాపదేశంగా ఎన్నికల ముగ్గులోకి లాగుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో పోటీ చేస్తున్న జీవితారాజశేఖర్ జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేయడానికి ఆసక్తి చూపటం లేదని మీడియాకు చెప్పారు. ఇటీవల ఓ సందర్భంలో ఎన్టీఆర్ ని కలిసిన జీవితా రాజశేకర్ ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయాలని అడిగినట్టు.. ఆయన సున్నితంగా తిరస్కరించిట్లుగా చెప్పింది. ఈ మద్య మంచు విష్ణు లైవ్ షోలో ఎన్టీఆర్ తనకు ఓటు వేస్తానని హామీ ఇచ్చారన్నాడు. దీంతో జీవిత తాను మీడియాతో చెప్పిన మాటలను వెనక్కి తీసుకుని, ఎన్టీఆర్కు క్షమాపణలు చెప్పారు.
ఎన్టీఆర్ కాజువల్ గా చర్చించిన విషయాలను తాను మీడియా ముందు ప్రస్థావించడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని ఒప్పుకున్నారు. ఇలాంటి సమయంలో ఒకరి వ్యక్తిగత విషయాలు బయట ప్రస్థావించకూడదన్న విషయం తెలిసిందని అన్నారు. అయితే ‘మా’ లో నెలకొని ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత బాధగా ఉందని ఎన్టీఆర్ చెప్పారని, తనని ఓటు వేయమని అభ్యర్థించినప్పుడు తను ఏమీ చెప్పలేదన్న సంగతిని వివరించారు జీవిత.