తెలుగు సినీ రంగానికి ప్రస్తుతం ఏకైక పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవేనా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు జీవించి ఉన్నంత వరకు తెలుగు సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా తానే పెద్ద దిక్కుగా ఉండి సమస్యను పరిష్కరించేవారు. తెలుగు టీవీ రంగం నుంచి సినీ రంగం వరకు చిన్నాపెద్ద తారతమ్యాలు లేకుండా సమస్యలు ఎదురైతే ఆయన తనదైన శైలిలో సమస్యను పరిష్కరించి పంపేవారు. అయితే.. ఆయన మరణించాక ఆ స్థానం ఖాళీగా ఉంటూ వచ్చింది. అయితే.. ఇప్పుడు ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి భర్తీ చేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
తాజాగా ఏపీ టికెట్స్ ధరల వివాదానికి సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంపై చర్చించేందుకు నేడు సీఎం జగన్, చిరంజీవిని ఆహ్వానించారు. ఇద్దరి మధ్య గంటకు పైగా సమావేశం జరిగింది. భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే సమస్యకు పరిష్కారం వస్తుందని తెలిపారు. సీఎంతో భేటీ సంతృప్తి గా సాగింది అన్నారు. ఈ నేపథ్యంలో అందరిని ఒక విషయం ఆకర్షించింది. అదేంటంటే ఇండస్ట్రీ తరుపున టికెట్స్ వివాదంపైన చర్చించడానికి సీఎం జగన్ గారు అందరిని కాదని చిరంజీవిని ఆహ్వానించారు. అంటే ప్రభుత్వం సినీ పెద్దగా చిరంజీవిని గుర్తుంచినట్టే అనే టాక్ వినిపిస్తోంది.
కొన్ని రోజుల క్రితమే చిరంజీవి ఒక వేదిక మీదుగా తనకు ఇండస్ట్రీ పెద్దగా అనిపించుకోవాలని లేదని స్పష్టం చేశారు. ప్రతి విషయంలో తలదూర్చలేనని తెలిపారు. ఇండస్ట్రీకి సమస్య వస్తే పెద్ద బిడ్డగా ముందుంటానే తప్పితే.. పెద్దరికం వద్దన్నారు. అయితే చిరంజీవి పెద్దరికాన్ని దూరంగా ఉండాలని భావించినప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చు అని నేటి భేటీతో స్పష్టం అవుతోంది.
ప్రభుత్వం టికెట్స్ ధరల వివాదంపై చర్చించడానికి అపార అనుభవం, అన్ని అంశాలపైన అవగాహన ఉన్న వ్యక్తిని, అందరకి ఆప్తుడు అనిపించే వ్యక్తితో భేటీ కావాలని భావించింది. అప్పుడు వారికి కనిపించిన ఏకైక వ్యక్తి చిరంజీవి.
సమస్యలపైన స్పందించడమే కాక, చేతనైన సహాయం చేయడంలోనూ చిరంజీవి ఎపుడు ముందుంటారు. అందుకే ఆయన పెద్దరికం వద్దన్నప్పటికీ ప్రభుత్వం ఆయనను చర్చలకు ఆహ్వానించింది. అంటే సినీ పెద్దగా చిరంజీవి సరైన వ్యక్తిగా ప్రభుత్వం గుర్తించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.