టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే నార్త్ భామలే గుర్తొస్తారు. వాళ్లకు సరిగా మన భాషనే రాదు. ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఒకటి రెండు ముక్కలు తప్పించి పెద్దగా నేర్చుకోరు కూడా. ఇక కన్నడ, మలయాళ భామలు.. అందులో కొందరు మాత్రం చాలా డిఫరెంట్. ఇక్కడి సినిమాల్లో చేస్తున్నాం కదా అని ఓన్లీ నటన వరకే సరిపెట్టరు. భాష నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నిత్యామేనన్ ఒకరు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఓ వీడియోనే వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నిత్యామేనన్, ‘అలా మొదలైంది’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాకు డబ్బింగ్ చెప్పుకోవడం మాత్రమే కాదు సాంగ్ కూడా పాడి చాలామందిని ఆశ్చర్యపరిచింది. గ్లామర్ గా పూర్తిగా నో చెప్పే నిత్యామేనన్.. చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తోంది. చివరగా ‘భీమ్లా నాయక్’లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు జోడీగా నటించిన ఈ భామ.. ప్రస్తుతం మలయాళ, తమిళంలో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది.
అయితే షూటింగ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాపురం వెళ్లిన నిత్యామేనన్.. అక్కడే ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లింది. తెలుగు పాఠాలు చెప్పింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలోనే పోస్ట్ చేసింది. తన న్యూ ఇయర్ ఇలా జరిగిందని రాసుకొచ్చింది. ఈ వీడియోని నెటిజన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ.. ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుందో అని అంటున్నారు. ‘నిత్యామేనన్.. మలయాళీ కాదు తెలుగమ్మాయి’ అని ఓన్ చేసుకుంటున్నారు. మరి నిత్యామేనన్ స్కూల్ లో టీచర్ గా పాఠాలు చెప్పడం మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.