సూపర్ స్టార్ కృష్ణ.. అద్భుతమైన నటుడు, అంతకంటే మంచి మనిషి. ఇండస్ట్రీలో అజాత శత్రువు ఎవరూ అంటే కృష్ణ పేరే చెబుతారు. ఎందుకంటే తన బాగు కోసం కాకుండా ఇండస్ట్రీ కోసం కష్టపడ్డారు. వందల సినిమాల్లో హీరోగా నటించారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. అయితే కృష్ణ సినిమాల గురించి తప్పించి ఆయన చేసిన మంచి పనులు పెద్దగా బయటకు రావు. ఎందుకంటే ఆయన అలాంటివి చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా సరే కృష్ణతో తమ అనుబంధాన్ని బయటపెడితే.. ఇదిగో ఇలా అందరికీ తెలుస్తుంటాయి. పైన చెప్పినట్లు ‘డీజే టిల్లు’ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణకు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చివరి వరకు చదివేయండి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ మానుకోటకు చెందిన ఓ పిల్లాడికి సినిమాలంటే చాలా పిచ్చి. 1973లో ఏడో క్లాస్ పరీక్షలు రాసి, సెకండ్ షో సినిమాకు వెళ్లాడు. సినిమా ప్రభావమో ఏమో కానీ చేతిలో 20 రూపాయలు ఉంటే, దాంతో మద్రాసు ట్రైన్ ఎక్కేశాడు. అక్కడ దిగిన తర్వాత పగలంతా సినిమా హీరోల ఇళ్ల చుట్టూ తిరిగాడు. రాత్రి కాగానే ఏం చేయాలో తెలీక భయం భయంగా గడిపాడు. ఒంటరిగా ఉన్న ఆ పిల్లాడిని చూసిన ఓ డ్రైవర్.. తన కారు షెడ్ లో పడుకోనిచ్చాడు. ఇక ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ పిల్లాడు.. హీరో కృష్ణ ఇంటి దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు తచ్చాడుతూ కనిపించాడు. ఆ పిల్లాడిని చూసిన విజయనిర్మల, కృష్ణ సాయంత్రం ఇంటికొచ్చాక.. వాడి గురించి చెప్పింది. దీంతో ఇంటికి పిలిచారు. ఎవరు నువ్వు అని ఆ పిల్లాడిని అడిగారు. అనాథని అని ఆ పిల్లాడు అబద్ధం చెప్పాడు. సరేలే ఇక్కడ ఉండు అని కృష్ణ-విజయనిర్మల అనేశారు. ఆ తర్వాత డ్రైవర్ ని పిలిచి, ఈ పిల్లాడికి కొత్త బట్టులు కొనివ్వమని చెప్పారు.
తర్వాతి రోజు దీపావళి కావడంతో ఆ పిల్లాడితో టపాసులు కూడా కాల్పించారు. అలా ఆ పిల్లాడు.. దాదాపు మూడు నెలల పాటు కృష్ణ ఇంట్లోనే ఉండిపోయాడు. ఎవరెవరు ఫోన్ చేశారు అనే విషయాలు నోట్ చేసుకోవడం.. ఆ పిల్లాడు పనిగా పెట్టుకున్నాడు. ఇక మూడునెలల తర్వాత ఆ పిల్లాడి తల్లిదండ్రులు వెతుక్కుంటూ కృష్ణ ఇంటికి వచ్చారు. వాడు ఇలా పారిపోయి వచ్చాడని కృష్ణతో అసలు విషయం చెప్పారు. దీంతో ఆ పిల్లాడిని పిలిచిన కృష్ణ.. ‘తల్లిదండ్రులను బాధపెట్టకు, బాగా చదువుకో, ఆ తర్వాత సినిమాలు’ అని చెప్పి తల్లిదండ్రులతో పంపించేశారు. ఆ పిల్లాడికి సినిమాల పిచ్చి కావడంతో మధ్యలో ఓసారి కృష్ణని కలిశారు. ఆయనిచ్చిన కీ చైన్ ని గిఫ్ట్ గా తీసుకున్నారు. ఆ తర్వాత 40 ఏళ్ల పాటు కృష్ణని కలవలేదు.
ఇక ఆ తర్వాత కృష్ణ చెప్పినట్లే ఆ పిల్లాడు బాగా చదువుకున్నారు. మంచిగా సెటిలయ్యారు. అతడి పేరు పింగిలి శ్రవణ్ కుమార్. పైన ఇప్పటివరకు చెప్పిన మొత్తం విషయాన్ని ఆయనే ఓ ప్రముఖ న్యూస్ పేపర్ లో 2015లో ఆర్టికల్ లా రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా శ్రవణ్.. హీరో కృష్ణ గుర్తుగా తన పిల్లలకు విమల్ కృష్ణ, రమ్యకృష్ణ అని పేర్లు కూడా పెట్టుకున్నారు. శ్రవణ్ కొడుకు విమల్ కృష్ణనే.. మనల్ని ఎంతగానో ఎంటర్ టైన్ చేసిన ‘డీజే టిల్లు’ డైరెక్టర్. మనోడు బీటెక్ పూర్తి చేసినప్పటికీ, సినిమాల్లోకి వచ్చాడు. ప్రస్తుతం డైరెక్టర్ గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడు ఆ పిల్లాడిని కృష్ణ.. తన ఇంట్లో పెట్టుకుని చూడకపోయింటే.. ఈరోజు విమల్ కృష్ణ ఉండేవాడు కాదు, మనకి ‘డీజే టిల్లు’ సినిమా కూడా ఉండేది. సో అదన్నమాట విషయం. ఇదే కాదు సూపర్ స్టార్ కృష్ణ, చాలామందికి చాలా విషయాల్లో సాయం చేశారు. కాకపోతే అవి పెద్దగా బయటకు రాలేదంతే!