సినిమా ఇండస్ట్రీలో ఎవరి రాత ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాదు. ఎవరు ఎప్పుడు తారా స్థాయికి చేరతారో.. ఎవరు నేల మీదకు దిగుతారో ఊహించలేం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే.. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో విజయవంతంగా రాణిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే దిల్ రాజు. మరి ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం ఎలా సాగుతుంది.. ఆయన ఎదుర్కొనే పరిస్థతులు ఎలా ఉంటాయంటే...
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల లోకం. దూరం నుంచి చూసిన వారికి.. ఇక్కడంతా వెలిగిపోతున్నట్లే కనిపిస్తుంది. దాంతో తాము ఆ రంగుల లోకంలో తారలా వెలిగి పోవాలని ఎందరో కలలు కంటారు. తల్లిదండ్రులు వద్దన్నా సరే.. వారిని ఒప్పించో లేక.. పారిపోయే వచ్చి సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలు పెడతారు. దిగితే కానీ లోతు తెలియదన్నట్లు.. ఒక్కసారి దానిలోకి ఎంటరైతేనే.. దాని అసలు రంగు తెలుస్తుంది. తాము చూసిన మెరుపులు అన్ని పైపై హంగులు అని.. తెర వెనక చీకట్లో ఎన్నో జీవితాలు మగ్గిపోతున్నాయని ఆ తర్వాత అర్థం అవుతుంది. ఇక పరిశ్రమలో ఎలా ఉంటుంది.. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అర్థం అయ్యాక.. తత్వం బోధపడ్డాక చాలా మంది.. వెనుదిరుగుతారు. కానీ కొందరు మాత్రం.. అవకాశాల కోసం అక్కడే పడి గాపులు కాస్తుంటారు. కారణం వారికి సినిమా మీద ఉన్న పిచ్చి ప్రేమ.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ప్రతిభ, అదృష్టంతో పాటు.. సినిమా అంటే అమితమైన పిచ్చి ఉండాలి. అది ఉంటేనే ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకోని.. ముందుకు సాగగలుగుతాం. దిల్ రాజు విషయంలో ఈ మాట అక్షర సత్యం అనిపించక మానదు. ఆయనకు సినిమాలంటే ఇష్టం, ప్రేమ మాత్రమే కాదు పిచ్చి కూడా. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. జయపాజయాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు దిల్ రాజు.
మిగతా రంగాలతో పోలిస్తే.. సినిమా ఇండస్ట్రీ అనేది గ్యాంబ్లింగ్ లాంటిది అని చెప్పవచ్చు. ఇక్కడ సక్సెస్ రేట్ అనేది కేవలం 2 శాతం మాత్రమే. ఓ కథను నమ్మి.. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. 24 రంగాలకు చెందిన నిపుణులు.. కొన్ని వందల మంది ఆర్టిస్ట్లు.. నెలల తరబడి పని చేస్తే కొన్ని గంటల నిడివి ఉన్న సినిమా తెరకెక్కుతుంది. వందల మంది ఎన్నో గంటల శ్రమ.. వృథా అయ్యిందా లేదా అన్నది.. థియేటర్కి వచ్చే ప్రేక్షకుడి సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. సినిమా ప్రేక్షకుడికి నచ్చితే ఓకే.. లేదంటే.. అన్ని రోజుల శ్రమ వృథా అవ్వడమే కాక.. ఎందరో జీవితాలు తారుమారు అవుతాయి.
ఇక కరోనా తర్వాత మిగతా రంగాలతో పోలిస్తే.. సినిమా పరిశ్రమలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఓటీటీల హవా, టికెట్ ధరల పెంపు ఇలా కారణాలు ఏవైనా సరే.. ఇప్పుడు ప్రేక్షకుడు థియేటర్కు వెళ్లి సినిమా చూసే స్థితిలో లేడు. సెలక్టెడ్ సినిమాలు, మౌత్ టాక్ బాగున్న వాటినే థియేటర్లో చూస్తున్నారు. చాలా సినిమాలను ఓటీటీల్లోనే వీక్షిస్తున్నారు. కరోనా ముందు వరకు శుక్రవారం వచ్చిందంటే చాలు.. చిన్నాపెద్దా సినిమాలు 5-6 అయినా ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. మరి ఇప్పుడో.. చిన్న హీరోల సినిమాలే కాదు.. స్టార్ హీరోల చిత్రాలు కూడా థియేటర్లో విడుదల చేయాలంటే భయపడే పరిస్థితులు. వారు కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎందరో నిర్మాతలు కనుమరగు అయ్యారు. బడా నిర్మాతలు సైతం.. ఆచితూచి అడుగు వేస్తున్నారు. టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్లుగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్లు సైతం.. సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి అడుగు వేస్తున్నారు. వీరిద్దరి జీవితం ఇండస్ట్రీలోనే ప్రారంభమై.. ఇక్కడే కొనసాగుతోంది. సినిమా ఇండస్ట్రీలో వీరి అనుభవం అపారం. వీరి కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు చూసి ఉంటారు. అయినా సరే.. నేడు ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో.. వారు ఆచి తూచి సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.
సినిమా కుటుంబంలో పుట్టి, పెరిగి.. సినిమానే లోకంగా బతికిన సురేష్ బాబు, అల్లు అరవింద్లు ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల విషయంలో గతంలో మాదిరిగా అంత దూకుడుగా ఉండటం లేదు. కథ వారికి ఎంతగానో నచ్చితేనే రంగంలోకి దిగుతున్నారు. లేదంటే కామ్గా ఉంటున్నారు. కానీ దిల్ రాజు మాత్రం ఇందుకు భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. సినిమా జయాపజయాలను ఆయన పట్టించుకోవడం లేదు. తాను స్వయంగా సినిమాలకు నిర్మాతగా ఉండటమే కాక డిస్ట్రిబ్యూటర్గా కూడా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన విజయవంతంగా ముందుకు సాగుతున్నారా అంటే కాదు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన థాంక్యూ సినిమా ఫెయిల్ అయితే.. డిస్ట్రిబ్యూట్ చేసిన బింబిసారా.. భారీ విజయం సాధించింది. ఇక తాజాగా విడుదల అయిన శాకుంతలం సినిమాకు ఆయన నిర్మాణ భాగస్వామిగా చేరితో అది డిజాస్టర్గా మిగిలింది. ఇదే సమయంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన విరూపాక్ష ఘన విజయం సాధించింది.
ఇవే కాక ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, మసూద వంటి చిత్రాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసి సక్సెస్ సాధించాడు. ఇక రీసెంట్ హిట్ బలగం సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కథ, మిగతా అంశాలను పక్కకు పెడితే దిల్ రాజు బ్యానర్ మీద తెరకెక్కిన సినిమా అనే కారణంగా సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అనుకున్నట్లే సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన శాకుంతలం.. భారీ డిజాస్టర్గా మిగిలింది. కొన్ని విజయం సాధిస్తే.. మరి కొన్ని ప్లాప్ అవుతున్నాయి. కానీ దిల్రాజు మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు.
వరుస పెట్టి చిత్రాలు నిర్మాణం చేపట్టడం, కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం.. బాగుందునుకున్న సినిమాల విడుదల బాధ్యతను తాను తీసుకుని.. వారికి అండగా నిలవడం వంటివి చేస్తూ.. ఈ గడ్డు పరిస్థితుల్లో సైతం టాప్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు దిల్ రాజు. ఇలా సినిమాలే లోకంగా బతికే ఆయనపై వచ్చే విమర్శలకు లెక్కేలేదు. చిన్న సినిమాలను తొక్కేస్తాడని.. థియేటర్లు దొరక్కుండా అడ్డుకుంటాడని ఎన్నో విమర్శలు. కానీ దిల్ రాజు మాత్రం వాటిని పట్టించుకోకుండా నిర్మాతగా వరుస సినిమాలు తీస్తూ.. డిస్ట్రిబ్యూటర్గా సినిమాలను విడుదల చేస్తూ.. ముందుకు సాగుతున్నారు. లాభం, నష్టం గురించి పట్టించుకోవడం లేదు. కారణం సినిమాలపై ఆయనకున్న పిచ్చి ప్రేమ. దిల్ రాజు స్థానంలో వేరే ఎవరు ఉన్నా.. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతారా అంటే కచ్చితంగా లేదనే సమాధానమే వస్తుంది.
కానీ దిల్ రాజు మాత్రం సినిమాలే లోకంగా ముందుకు సాగుతున్నారు. సరే ఇందులో ఆయన స్వార్థం కూడా ఉండవచ్చు. కానీ దానికి మించిన ప్రేమ.. సినిమాల మీద ఆయనకు ఉంది. అందుకే లాభనష్టాలతో సంబంధం లేకుండా.. ఆటు పోట్లను తట్టుకుంటూ.. కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ.. చిన్న సినిమాలకు మద్దతుగా నిలుస్తూ.. ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయనను దగ్గరగా చూసిన వాళ్లు ఎవరైనా సరే.. ఇండస్ట్రీలో దిల్ రాజులా బతకడం మాత్రం చాల నరకం అంటారు. కానీ దిల్ రాజు మాత్రం చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు. ఆయన మరెన్నో మంచి చిత్రాలను నిర్మించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి సినిమాలపై దిల్ రాజు ఇంత వ్యామోహం పెంచుకోవడం కరెక్ట్ అంటారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేనయండి.