‘‘ఈతరం వాళ్లకు హీరోలంటే కేవలం రామ్ చరణ్, బన్నీ, వైష్ణవ్ తేజ్ మాత్రమే గుర్తుకు వస్తున్నారు. నా మనవళ్లు, మనవరాళ్ల ముందు నా గురించి నేనే డబ్బా కొట్టుకోవాల్సి వస్తుంది అంటూ’’ సరదాగా వ్యాఖ్యానించారు మెగాస్టార్ చిరంజీవి. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభు రాసిన పుస్తకం చూశాకా చాలా బాగా రాశాడు.. ఇలాంటి వారు మన తెలుగు పరిశ్రమలో ఉండటం ఎంతో మంచి విషయం. అలానే జర్నలిస్టులు నాకు ఇచ్చే సూచనలు నాకు ఎంతో నచ్చుతాయి. తెలుగు పరిశ్రమలో ఆరోగ్యకరమైన జర్నలిస్టులు ఉన్నారు’’ అని ప్రశంసించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు’ పుస్తకం టైటిల్ ఎంతో అద్భుతంగా ఉంది. ప్రస్తుత తరానికి ఈ పుస్తకం చాలా అవసరం. ఎందుకంటే.. ఇప్పుడున్నవారికి.. ముందు తరాల సినిమా లెజెండ్స్ గురించి తెలియదు. ఎక్కడో బయట ఇలా జరగడం కాదు.. మా ఇంట్లోనే ఈ పరిస్థితులున్నాయి. 5, 8,9 ఏళ్ల నా మనవళ్లు, మనవరాళ్లకు హీరో అంటే ఎంతసేపు రామ్ చరణ్, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్. వీరే హీరోలని భావిస్తున్నారు. వాళ్ల సినిమాలే చూస్తారు.. వాళ్ల పాటలే పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు. అది చూసి నా కడుపు తరుక్కుపోతుంది. అరే నా సినిమాలో ఎన్ని మంచి పాటలున్నాయి.. ఒక్కసారి కూడా దాని గురించి అడగరేంటి అని ఫీలయ్యేవాడిని. నా ఇంట్లోనే నాకు శత్రువులు తయారయ్యారు’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
‘‘ఇక కరోనా సమయంలో అందరం ఇళ్లలోనే ఉన్నాం కదా. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో.. నా మనవళ్లు, మనవారళ్లకు నా గురించి నేనే చెప్పుకోవడం ప్రారంభించాను. నా సినిమాలన్ని చూపించాను. వారు ఆశ్చర్యపోయారు. బయ్యా మీరా.. ఇంత బాగా డ్యాన్స్ వేసింది అంటూ ఆశ్చర్యపోయారు. అదృష్టం వాళ్లు నన్ను తాత అని పిలవరు.. బయ్యా అంటారు. అప్పుడు నేను మీ మామ, బాబయ్ వీళ్లంతా నా ముందు బచ్చాగాళ్లమ్మ అన్నాను. ఆ తర్వాత నుంచి నా సినిమాలు, పాటలకు వాళ్లూ కూడా ఫ్యాన్స్ అయ్యారు. మొన్న గాడ్ఫాదర్ రిలీజ్ అయినప్పుడు నా మనవళ్లు, మనవరాళ్లు నాలుగు సార్లు ఆ సినిమా చూశారు. చిన్నపిల్లల కోసం ఆ సినిమాలో ఏం లేదు కదా అంటే నీ స్టైల్, డ్యాన్స్ సూపర్ భయ్యా అన్నారు. ఈ తరం పిల్లలు అలా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘నన్ను నేను నిరూపించుకోవడానికి చిన్న పిల్లల దగ్గర సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చింది. కొన్ని ఏళ్లు గడిచేసరికి.. మన ముందు ఉన్న దిగ్గజాల గురించి మరిచిపోతున్నారు. అలాంటి వాళ్ల గురించి భవిష్యత్తు తరాలకు చెప్పడానికి పూనుకున్నందకు చాలా సంతోషంగా ఉంది’’ అంటూ ప్రభుపై ప్రశంసలు కురిపించారు చిరంజీవి. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.