ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ వస్తే సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోవచ్చని చాలామంది ఫీలింగ్. అందుకు తగ్గట్లే ఎవరు అవకాశం ఇస్తామన్నా సరే రెడీగా ఉంటారు. డబ్బులిచ్చేందుకు కూడా ఏమాత్రం వెనుకాడరు. ఇలాంటి వారిని మోసం చేసేందుకు ఎప్పుడు కొందరు పక్కా ప్లాన్స్ తో సిద్ధంగా ఉంటారు. ఆ హీరో తెలుసు, ఈ హీరోయిన్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో అలాంటి సంఘటనే జరిగింది. పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న రష్మిక పేరు చెప్పి.. ఓ వ్యక్తిని టోకరా చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. చిన్నపిల్లలకు మోడలింగ్ లో ట్రైనింగ్ ఇచ్చి, సినిమా ఛాన్సలు ఇప్పిస్తామని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. బాలీవుడ్ యాక్టర్స్ అయిన వారిని అపూర్ అశ్విన్, నటాషా కపూర్ గా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ర్యాంప్ షోలు నిర్వహిస్తామని వీళ్లు చెబుతూ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాస్మోపాలిటన్ మోడల్ పేరుతో ఓ వెబ్ సైట్ కూడా రన్ చేస్తున్న ఈ ఇద్దరూ.. తమ బుట్టలో పడిన ఓ వ్యాపారవేత్తను సైతం బురిడి కొట్టించారు. ఆయన దగ్గర నుంచి ఏకంగా రూ.20 లక్షలకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. రోజులు గడుస్తున్నా సరే వారి నుంచి ఎలాంటి కబురు లేకపోవడంతో సదరు వ్యాపారవేత్తకు సీన్ అర్థమైపోయింది.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన వ్యాపారవేత్త.. వెంటనే పోలీసులని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు.. దర్యాప్తు జరిపి తాజాగా వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే వారికి హీరోయిన్ రష్మికతో పరిచయం ఉందా? లేదా ఆమె పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇలా జరగడం ఇదేం కొత్త కాదు. అపరిచిత వ్యక్తులని నమ్మొద్దని, వారికి డబ్బులిచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా సరే జనాలు.. ప్రలోభాలకు గురవుతూనే ఉన్నారు. దీంతో ఇలాంటి మోసాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. మరి రష్మిక పేరు చెప్పి రూ.20 లక్షలు మోసం చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.