తెలుగు ఇండస్ట్రీలో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్న లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. ఈ చిత్రంతో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గణేష్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. విజయదశమి కానుకగా ఈ చిత్రం 5వ తేదీ రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ గణేష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నాది మొదటి నుంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబం.. నా సోదరుడు హీరోగా రాణిస్తున్నాడు. నాన్న మంచి ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మంచి చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న సమయంలో డైరెక్టర్ లక్ష్మణ్ ‘స్వాతిముత్యం’ కథ చెప్పారు.. నాకు ఎంతోబాగా నచ్చింది. నిర్మాత నాగ వంశికి కూడా బాగా నచ్చడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎలాంటి జోనర్ సినిమానైనా ఆదరిస్తారు. అన్నయ్య సలహాలు సూచనలు ఏమీ ఇవ్వలేదు.. కానీ నాపై మంచి నమ్మయం పెట్టుకొని బాగా ప్రోత్సహించారు.
ప్రస్తుతం కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదు. తర్వాత ఓటీటీలో చూడొచ్చులే అనుకుంటున్నారు. అందుకే ఒక డిఫరెంట్ కథాంశంతో మీ ముందుకు వస్తున్నా. ఈ చిత్రం ‘విక్కీ డోనార్’ తో పోల్చవొద్దు.. సినిమా చూశాక ఆ విషయం మీకే అర్థమవుతుంది. తాను గతంలో ప్రొడక్షన్ పనులు చూశాను.. అలాగే నటనలో శిక్షణ తీసుకోవడం, అన్ని విషయాల గురించి తెలుసుకోవడం వల్ల షూటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. ఈ కథ నాన్న కూడా విన్నారు.. ఆయనకు మంచి నమ్మకం కలిగింది అందుకే ఒకే చెప్పారు.
సీనియర్ నటులతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది.. గొప్ప ప్రతిభ, అనుభవమున్న నటీనటులతో పని చేయడం నా అదృష్టం. ‘నేను స్టూడెంట్’ అనే ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయింది. త్వరలో పూర్తి అప్ డేట్స్ మీ ముందు ఉంచుతాం. ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ సినిమాలతోపాటు మీ చిత్రం విడుదల కావడం కొద్దిగా ఆందోళనగా ఉన్నప్పటికీ.. దసరా అనేది పెద్ద పండగ. ప్రేక్షకులకు నచ్చేలా ఉంటే ఇలాంటి పండగకు ఎన్ని సినిమాలైనా ఆదరణ పొందుతాయి. మా స్వాతిముత్యం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నాను. ఈ చిత్రం కుటుంబం మొత్తం కలిసి చూసి ఆనందించే విధంగా ఉంటుందని అన్నారు బెల్లంకొండ గణేష్.