ముఖానికి రంగు వేసుకుని వెండితెరపై వెలిగిపోవాలని, తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని చాలా మందికి ఉంటుంది. కానీ అందులో కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ఇక ప్రతీ సంవత్సరం పదుల సంఖ్యలో ఇండస్ట్రీకి కొత్తకొత్త నటులు వస్తూనే ఉంటారు. అన్ని సంవత్సరాల్లాగే ఈ ఏడాది కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా మంది యువ నటీ, నటులు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరి వారు ఎవరు? తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచారా? లేదా? అన్న విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2022లో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. అయితే అందులో కొద్ది మంది మాత్రమే తమ నటనతో ఆకట్టుకున్నారు. బెల్లంకొండ గణేష్, ఆశిష్, అశోక్ గల్లా, మృణాల్ ఠాకూర్, సాయి మంజ్రేకర్, సాయి ధన్సికా, గెహనా సిప్పి, సంయుక్త మీనన్, లైగర్ బ్యూటీ అనన్య పాండే. మరి ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించారో ఇప్పుడు ఒక్కసారి పరిశీలిద్దాం.
స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడిగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు బెల్లంకొండ గణేష్. అన్నలా మాస్ సినిమాతో కాకుండా మంచి క్లాస్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వచ్చిన చిత్రం ‘స్వాతిముత్యం‘ రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ అనుకున్నంతగా విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. అయితే ఈ సినిమాలో గణేష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
ఒకే ఒక్క సినిమాతో కావల్సినంత పేరు సంపాదించుకుంది మృణాల్. హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రేమకావ్యంగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో సీతగా నటించిన మృణాల్ తొలి చిత్రంతోనే టాలీవుడ్ ను తనవైపు తిప్పుకుంది. తన అందంతో, అభినయంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సీతారామం సినిమాతో టాలీవుడ్ డైరెక్టర్లను, నిర్మాతలను తనవైపు చూసేలా చేసుకుంది ఈ బ్యూటీ.
ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా సుపరిచితుడు. దాంతో అటు పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఇటు సినిమా బ్యాగ్రౌండ్ కావల్సినంత ఉంది అశోక్ కు. దాంతో శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ‘హీరో’ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే తన నటన ఏంటో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించకపోయినప్పటికీ అశోక్ గల్లా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆశిష్ రెడ్డి. తొలి సినిమా ‘రౌడీ బాయ్స్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా ఈ మూవీని దిల్ రాజే నిర్మించాడు. స్టార్ హీరోయిన్ అనుపమ.. ఆశిష్ కు జంటగా నటించింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీలో ఆశిష్-అనుపమ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఇద్దరి మధ్య రొమాంటిక్ సిన్ లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి.
ఇక ఈ ఏడాదిలో టాలీవుడ్ కు పరిచయం అయిన మరో మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. ఇతర బాషల్లో చాలా సినిమాలే చేసినప్పటికీ తెలుగు తెరపైకి మాత్రం ఓ భారీ చిత్రంతోనే అరంగేట్రం చేసింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్. ఈ సినిమాలో రానాకు జోడీగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలను అందుకుంది సంయుక్తా మీనన్.
వీరితోపాటుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా వెలుగొందుతున్న మరికొంత మంది హీరోయిన్ లు కూడా 2022లో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. వారిలో గెహనా సిప్పి ఒకరు. హీరో ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ భామా. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా గాలోడులో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఈ వరుసలో ఉన్న మరో ముద్దుగుమ్మ సాయి మంజ్రేకర్. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంజ్రేకర్.. అడవి శేష్ ‘మేజర్’ చిత్రంతో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంది. వీరితోపాటుగా షికారు మూవీతో సాయి ధన్సికా, లైగర్ సినిమాతో బాలీవుడ్ సోయగం అనన్య పాండే, RRRతో ఆలియా భట్ లు టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేశారు.