తెలుగు సినిమా ఇండస్ట్రీలో తరచుగా సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. తమ అభిమాన నటుల సినిమాలు చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక సినిమా రివ్యూలకు సంబంధించి ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నగరంలో సినిమా థియేటర్లకు కొదవ లేదు. సినీ ప్రేక్షకుల కోసం అందుబాటులో సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. తరచుగా సినిమాల విడుదలతో థియేటర్లన్ని ప్రేక్షకులతో సందడిగా మారుతాయి. నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్ల విషయానికి వస్తే పివిఆర్, ఐనాక్స్, ప్రసాద్స్ మల్టీప్లెక్స్ పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఆడియెన్స్ సినిమాలు వీక్షించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నగరంలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కు ఎనలేని క్రేజ్ ఉంటుంది. నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద ఉండే ప్రసాద్స్ మల్టీప్లెక్స్ గురించి తెలియని సినీ ప్రియులే ఉండరు. కాగా తాజాగా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రసాద్స్ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రాంగణంలో మూవీ రివ్యూలను నిషేధిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం వచ్చిందంటే చాలు న్యూ మూవీస్ రిలీజ్ తో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వద్ద సందడి మామూలుగా ఉండదు. అందులో పెద్ద హీరోల సినిమాలైతే ఆడియెన్స్ హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక సినిమా రివ్యూల కోసం వచ్చే పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ప్రాంగణంలో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వారు ప్రేక్షకుల నుంచి తీసుకునే రివ్యూల విషయంలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ క్రమంలో ప్రేక్షకులు ఇచ్చే రివ్యూలతో పలు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమాపై ప్రసాద్స్ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రాంగణంలో ఓ ప్రేక్షకుడు ఇచ్చిన రివ్యూతో ఆగ్రహం చెందిన ప్రభాస్ అభిమానులు భౌతిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అలర్ట్ అయిన థియేటర్ యాజమాన్యం ప్రసాద్స్ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రాంగణంలో సినిమా రివ్యూలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ప్రాంగణంలో యూట్యూబ్ ఛానల్స్ కు అనుమతిని నిషేధిస్తున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. భవిష్యత్ లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.