దిగ్గజ ఐటి కంపెనీ టిసిఎస్ లో ఉద్యోగం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. టాటా కంపెనీలో ఉద్యోగం సాధించి స్థిరపడాలని ఆశపడుతుంటారు. అటువంటి టిసిఎస్ లో జాబ్ స్కాండల్ వెలుగు చూసింది. ఈ అంశం టిసిఎస్ ను కుదిపేస్తుంది.
చదువు పూర్తైన తరువాత ఉద్యోగ వేటలో పడతారు యువతీ యువకులు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కొందరు ప్రయత్నిస్తే, మరికొందరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కోసం వెతుకులాడుతారు. కాగా ఇటీవలి కాలంలో ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఆ కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని మోసం చేయడం, ఫ్రాడ్ కంపెనీలు ప్రారంభించి ఉద్యోగార్థుల నుంచి డబ్బులు తీసుకుని ఆ తరువాత బోర్డు తిప్పేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ ఐటి కంపెనీలో కొందరు వ్యక్తులు ఉద్యోగార్థుల నుంచి డబ్బులు తీసుకుని నియమించుకుంటున్నట్లు ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
దిగ్గజ ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగం సాధించాలని యువత కలలు కంటుంటారు. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. కానీ తాజగా లంచం ఇస్తేనే ఉద్యోగం అనే టాపిక్ టిసిఎస్ ను కుదిపేస్తుంది. దేశ విదేశాల్లో టిసిఎస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అంత గొప్ప పేరున్న ఆ కంపెనీలో కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డట్టుగా తేలింది. టిసిఎస్ లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు నియామక సంస్థల నుంచి ఉద్యోగులను నియమించుకునేందుకు లంచాలు పుచ్చుకున్నట్లు టిసిఎస్ గుర్తించింది. టిసిఎస్ రిసోర్స్ మేనేజ్ మెంట్ గ్లోబల్ హెడ్ ఇ ఎస్ చక్రవర్త నియామక సంస్థల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం తెలిసింది.
ఇక ఈ వ్యవహారంపై టిసిఎస్ ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్ తో ఒక టీమ్ ను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ విచారణ అనంతరం రిక్రూట్ మెంట్ హెడ్ చక్రవర్తని లీవ్ పై పంపించి, రిసోర్స్ మేనేజ్ మెంట్ గ్రూప్ నుంచి నలుగురు ఎగ్జిక్యూటివ్స్ ను తొలగించింది టిసిఎస్. నియామక సంస్థల నుంచి రిక్రూట్ మెంట్ జరగకుండా నిషేదం విధించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నియామక సంస్థల నుంచి దాదాపు రూ. 100 కోట్ల వరకు ముడుపులు ఆ కుంబకోణంలో ఉన్న వ్యక్తి అందుకున్నట్లు తెలసింది. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన టిసిఎస్ లో లంచం ఇస్తేనే ఉద్యోగం అనే అంశం ఐటి రంగంలో చర్చకు దారితీసింది.