ప్రపంచ మొత్తం భారత వైవాహిక బంధానికి ఆకర్షితులవుతుంటే కొన్ని ఘటనలు మన సంస్కృతికి మచ్చ తెస్తున్నాయి. కాసుల వేటలో అందమే పెట్టుబడిగా వల విసిరి కాసులు కాజేస్తున్న కొన్ని ఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఓ వైపు ప్రియుడితో సంబంధం నెరపుతూనే తాళి కట్టిన వాడిని నిలువుదోపిడీ చేసిందో మాయలేడీ. ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకుని చివరుకు రెండో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కటకటాలపాలైంది. ప్రేమించి పెళ్లి చేసుకుని తనను మోసం చేసిన యువతిపై ఇండియన్ ఆర్మీ ఉద్యోగి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన విశాఖ జిల్లా గాజువాక పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి.
విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన ఓ యువతి శ్రీనివాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతడితో అన్ని హద్దులు దాటింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఈ విషయం తెలియని పెద్దలు ఆ యువతికి జగదీష్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే వివాహం అయిన మూడు రోజులకే భార్య గర్భవతి అని తేలియడంతో భర్త ఆమెను వదిలివేశాడు. దీంతో శ్రీనివాస్ వద్దకు వెళ్లింది ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అతడు పెళ్లిని వాయిదా వేస్తూ రావడంతో ఓ పాపకు జన్మనిచ్చింది. సీఐ మల్లేశ్వరరావు వివరాల మేరకు – చినగంట్యాడకు చెందిన యువతిని గతేడాది డిసెంబరులో ప్రసాద్ పెళ్లి చేసుకుని లక్నో తీసుకెళ్లారు. బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనిపించుకుని దఫదఫాలుగా రూ.90 లక్షల వరకు తీసుకున్న యువతి గాజువాక వచ్చేసింది.
మళ్లీ ఆమె తిరిగి రాకపోవడంతో బాధితుడు గాజువాక వచ్చి ఆరా తీశాడు. అయితే అంతకుముందే ఆమెకు అగనంపూడి, గాజువాకకు చెందిన మరో ఇద్దరితో పెళ్లిళ్లు అయినట్టు తెలిసింది. రెండో భర్త ఫిర్యాదుపై అడ్డంగా దొరికిపోయింది. నిందితురాలిపై ఐపీసీ 420, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు