ఎక్కడైనా తమ పిల్లల కంటే మిగతా పిల్లలు బాగా చదువుతుంటే.. ఆ కుర్రాడ్ని చూసి నేర్చుకోరా అని తమ పిల్లల్నే మందలించే తల్లిదండ్రులు ఉంటారు. కాని విచిత్రంగా తన కొడుకు కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని ఒక తల్లి ఏకంగా ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లాడిని చంపాలని చూసింది. ఇంతకంటే కసాయి మహిళ ఇంకెక్కడైనా ఉంటుందా? ఈ ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్ లో ఉన్న ప్రైవేట్ స్కూల్లో రాజేంద్రన్, మాలతి దంపతుల కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. బాగా చదవడమే ఆ కుర్రాడు చేసుకున్న పాపం. తన కొడుకు కంటే ఈ కుర్రాడికే ఎక్కువ మార్కులు వస్తున్నాయని అసూయతో రగిలిపోయిందో తల్లి. తన కొడుకు లాంటి వాడే అన్న ఇంగితం లేకుండా చంపేందుకు కుట్ర పన్నింది.
కూల్ డ్రింక్ లో విషం కలిపి ఆ కుర్రాడికి ఇవ్వమని సెక్యూరిటీ గార్డ్ కి ఇచ్చింది. డబ్బుకి కక్కుర్తి పడి సెక్యూరిటీ గార్డ్ ఆమె చెప్పినట్టే కుర్రాడికి ఆ కూల్ డ్రింక్ ఇచ్చాడు. కూల్ డ్రింక్ తాగిన కుర్రాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే అక్కడి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి సకాలంలో తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. చికిత్స చేసిన వైద్యులు.. కూల్ డ్రింక్ తాగడం వల్లే ఇలా జరిగిందని, అందులో విషం కలిపారని తెలిపారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సెక్యూరిటీ గార్డ్ ని ప్రశ్నించగా.. అతనికి ఒకామె కూల్ డ్రింక్ ఇచ్చి ఆ కుర్రాడికి ఇమ్మందని తెలిపాడు.
సీసీ కెమెరాల్లోని దృశ్యాల ద్వారా ఆ మహిళ రెండు కూల్ డ్రింక్ బాటిళ్లను సెక్యూరిటీ గార్డుకు ఇవ్వడాన్ని గుర్తించారు. ఆ దృశ్యాల ఆధారంగా సహాయరాణి విక్టోరియా అనే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమ కొడుకు ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాడని.. అయితే తన కొడుకుని అధిగమించి రాజేంద్రన్, మాలతిల కుమారుడు క్లాస్ ఫస్ట్ వస్తున్నాడని, అందుకే ఆ విద్యార్థిపై అసూయ, కోపం పెరిగి విషం ఇచ్చి చంపాలన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. మరి తన కొడుకు క్లాస్ ఫస్ట్ రావాలని, వేరే పిల్లాడ్ని చంపాలనుకున్న ఈ తల్లిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
ఇది కూడా చదవండి: అవకాశాల పేరుతో 100 మందికి పైగా యువతుల అశ్లీల దృశ్యాలు తీసిన డైరెక్టర్.. చివరికి..