ప్రేమ అనే రెండు అక్షరాల పదం ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పడం కష్టం. ఈక్రమంలో కొందరు యువతి యువకులు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు పెద్దలను ఎదిరించి పారిపోయి మరీ వివాహం చేసుకుంటున్నారు. అయితే మరొక వైపు ప్రేమికులపై అనేక దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో పరువు హత్యలు తరచూ అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై.. యువతి కుటుంబ సభ్యులు కొడవళ్లతో దాడి చేశారు. సదరు యువకుడిని ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టి..చనిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం ఆస్పత్రిలో బాధితుడు ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా లో చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హెచ్. మురవణి గ్రామానికి చెందిన ఉసేని కి సుకన్య(24) అనే కుమార్తె ఉంది. ఈమె గతేడాది డిసెంబర్ లో కాంట్రాక్ట్ పద్ధతిన స్థానిక ప్రాథమిక కేంద్రంలో కమ్యూనిటీ హెల్ ఆఫీసర్ గా విధులుల్లో చేరింది. ఈక్రమంలోనే సుకన్య అదే గ్రామానికి చెందిన పెద్ద వీరన్న కుమారుడు వీరేష్(28) ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెద్దల విషయం తెలియడంతో వారి వివాహానికి అడ్డు చెప్పారు. అయిన వీరిద్దరు ఇంట్లో పెద్దలకు తెలియకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. సుకన్య, వీరేష్ ల వివాహం.. యువతి తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో సుకన్య, వీరేష్ ఎమ్మిగనూరు పట్టణంలో వేరే కాపురం పెట్టారు. రోజూ అక్కడ నుంచి సుకన్య విధులకు హాజరయ్యేది. వీరేష్..తన భార్యను రోజూ ఉదయం బైక్ పై హెచ్.మురవణికి వెళ్లి డ్యూటీకి వదిలిపెట్టి సాయంత్రం తీసుకొని వచ్చేవాడు. ఇలా వారు రోజు కళ్లముందే కనిపిస్తూ ఉండటంతో సుకన్య కుటుంబ సభ్యులు వీరేష్ పై కోపం పెంచుకున్నారు.
గురువారం సాయంత్రం సుకన్యను బైక్ పై తీసుకొస్తుండగా ఆమె తండ్రి ఉసేని, వారి బంధువులు ఆటోతో వీరి బైక్ ను ఢీ కొట్టారు. దీంతో ఇద్దరు బైక్ పై నుంచి కిందపడిపోయారు. వెంటనే వీరేష్ పై యువతి బంధువులు విచక్షణ రహితంగా దాడి చేశారు. అతడు చనిపోయాడని భావించి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఊహించన పరిణామంతో భయాందోళనకు గురైన సుకన్య పరుగులు తీసి.. ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ కు చేరింది. అక్కడ జరిగిన విషయం పోలీసులకు వివరించింది. స్థానికులు బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఘటన స్థలంకి చేరుకున్నారు. వీరేష్ ను చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుడి భార్య సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.