నేటికాలంలో ప్రేమ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. కొందరు యువకులు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి యువతులను వలలో వేసుకుంటారు. అలాంటి వారి ప్రేమ నిజమని నమ్మి యువతులు మోసపోతుంటారు. తాజాగా కానిస్టేబుల్ కా ఉద్యోగం చేస్తున్న యువతి ఓయువకుడితో ప్రేమలో పడింది. అయితే ఆమె జాతకం లో కుజ దోషం ఉందనే సాకుతో పెళ్లికి నిరాకరించాడు ఆ ప్రియుడు దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి విషం తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గం జిల్లా తీర్థహళ్లి పోలీస్ స్టేషన్లో సుధ అనే మహిళ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. ఈక్రమంలో ప్రవీణ్ అనే వ్యక్తి సుధకు పరిచయమయ్యాడు. అతడు పారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. అలా ప్రవీణ్, సుధ ఆరేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈక్రమంలో పెళ్లి చేసుకుందామని సుధ, ప్రవీణ్ కి తెలిపింది. దీంతో సుధ జాతకాన్ని తన తల్లికి చూపించాడు ప్రవీణ్. అయితే అమ్మాయి జాతకంలో కుజ దోషం ఉందని అతని తల్లి వీరిద్దరి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో ప్రవీణ్ కూడా సుధతో పెళ్లికి నిరాకరించాడు. అయితే ప్రేమించేటప్పుడు అడ్డురాని జాతకాలు పెళ్లికి ఎలా అడ్డు వచ్చిందా? అని సుధ ప్రవీణ్ ని ప్రశ్నించింది. మే 31న భద్రావతిలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ ను వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని సుధ ప్రాధేయపడింది.
“నువ్వంటే ఇష్టం కానీ మా అమ్మ ఒప్పుకోవడం లేదు” అని ప్రవీణ్ తెలిపాడు. దీంతో ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం భద్రావతి ఏపీఎంసీ ఆవరణకు వెళ్లి విషం తాగేయాలని అనుకున్నారు. ప్రవీణ్ మొదట సుధనే విషం తాగమన్నాడు. అనంతరం అతను విషం తీసుకోలేదని తెలుస్తోంది. కానీ ఇద్దరిని శివమొగ్గలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం సుధను మెరుగైన చికిత్స కోసం మంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుధ మృతి చెందినట్లు తెలుస్తోంది. చనిపోయే ముందు పోలీసులతో సుధ పై వివరాలు తెలిపింది. భద్రావతి ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్లో ప్రవీణ్పై కేసు నమోదైంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.