ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య ఘర్షణలు అనేది సర్వసాధారణం. చాలా అరుదుగా మాత్రమే గొడవపడని అత్తాకోడళ్లు మనకు కనిపిస్తుంటారు. ఇక భార్యను, తల్లిని ఇద్దర్ని బ్యాలెన్స్ చేయడానికి మగవాళ్లు నానా తంటాలు పడుతుంటారు. అమ్మవైపు మాట్లాడితే భార్యకు కోపం, భార్యవైపు మాట్లాడితే అమ్మకి కోపం. ఇలా ఇద్దరికి సర్థి చెప్పలేక మగవాళ్లు తలలు పట్టుకుంటారు. అయితే కొందరు మాత్రం భార్య మాటలే వింటూ తల్లిని అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఈక్రమంలో పొరపాటున భార్య ఏడిస్తే చాలు ముందు వెనుకా ఆలోచించకుండా తల్లిపై విరుచకపడతారు. తాజాగా ఓ పుత్రరత్నం అలాంటి పనే చేశాడు. తన భార్య వండిన టామాట కూర బాగాలేదన్న తల్లిపై కుమారుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి తలకు బలమైన గాయమైంది. ఈ ఘటన మహబూబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబాబాద్ జిల్లా వేంనూరు గ్రామంలో మహేందర్, నందిని అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరితో కలిసి మహేందర్ తల్లి బుజ్జి కూడా ఉంటుంది. అప్పుడప్పుడు నందినికి, ఆమె అత్తకు మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతుండేవని సమాచారం. అలానే ఈ అత్తకోడళ్ల మధ్య జరిగిన ఓ చిన్న ఘర్షణ.. ఒకరి ప్రాణం మీదకు తెచ్చింది. నందిని వండిన టమాటా కూర బాగాలేదని ఆమె అత్త చెప్పింది. అంతేకాక కూర సరిగ్గాలేదని నందినిని ఆమె అత్త కాస్త మందలించింది. దీంతో మనస్తాపం చెందిన కోడలు కన్నీరు పెట్టుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త మహేందర్ కి అత్తపై ఫిర్యాదు చేసింది. దీంతో ‘నా భార్య వండిన కూరనే బాగలేదంటావా?’ అంటూ తల్లిపై మహేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగక ఇంట్లో ఉండే మటన్ కొట్టే కత్తితో తల్లిపై దాడికి దిగాడు.
విచక్షణ రహితంగా తల్లిపై మహేందర్ దాడికి తెగబడ్డాడు. ఈదాడిలో తల్లి బుజ్జి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆమెను వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బుజ్జి బంధువులు మహేందర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి, పెళ్లాం ఇద్దరూ.. మగవాళ్లకి రెండు కళ్లలాంటి వాళ్లు. ఏ ఒక్కర్ని తక్కువగా చూడకూడదు. అలానే వారిలో ఏ ఒక్కరి మాట విని రెండో వారిపై దాడి చేయడం సరైనది కాదు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.