ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ పరిచయాల వలన అనేక మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియాలో పరిచయమయ్యే స్నేహితులను గుడ్డి నమ్మి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మేక వన్నె పులిలాగా కొందరు దుర్మార్గులు అమాయకపు యువతులను తమ ట్రాప్ లోకి లాగుతున్నారు. చివరకు వారి వ్యక్తిగత సమాచారం తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. మరికొందరు యువతుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం కూడా చేస్తుంటారు. దీంతో తీవ్ర ఒత్తిడిలోనైయి.. కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. తాజాగా ఓ యువతి.. ఆన్ లైన్ లో పరిచయమైన వ్యక్తిని నమ్మి మోసపోయింది. ఈ క్రమంలో మానసిక వేదనకు గురై.. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా లోని బసవ కల్యాణ తాలుకాలోని ఇస్లాంపురకు చెందిన ఆరతి(28) స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తోంది. పిల్లలకు చక్కగా బోధిస్తూ స్థానికంగా మంచి పేరు సంపాందించిది. అంతే కాక విద్యార్ధులు తల్లిదండ్రులతో, తోటి వారితో ఎంతో కలివిడిగా ఉండేది. దీంతో ఆమెపై అందరికి గౌరవం, నమ్మకం ఏర్పడింది. ఇటీవల ఆన్ లైన్ లో రాజగోపాల్ అనే వ్యక్తి ఆరతికి పరిచయం అయ్యాడు. ఆమెతో మాట మాట కలిపి స్నేహం ఏర్పచుకున్నాడు. రాజగోపాల్ ను ఆరతి పూర్తిగా నమ్మింది. ఆ నమ్మకాన్ని ఆసరా చేసుకున్న గోపాల్.. నగదు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఆరతి ఇతరుల వద్ద అప్పు గా తీసుకుని రాజగోపాల్ కి విడతల వారీగా రూ.2.50 లక్షలు ఇచ్చింది.
ఆ తరువాత కూడా కొంత డబ్బులు ఇచ్చింది. అయితే ఇటీవల కొన్ని రోజుల నుంచి గోపాల్ కి ఫోన్ చేయగా స్విచాఫ్ అని వస్తుంది. దీంతో తాను మోసపోయినట్లు ఆరతికి అర్ధమైంది. మానసికంగా వేదన చెంది.. సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వివరిస్తూ డెత్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బసవ కల్యాణం రూరల్ పోలీసులు తెలిపారు. అందరితో కలివిడిగా ఉండే అమ్మాయి.. ఓ నీచుడి చేసిన మోసానికి బలైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.