తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాలు గడపాలని కొంతమంది కేటుగాళ్లు రక రకాల పద్దతుల్లో దొంగతనాలు.. మోసాలు చేస్తున్నారు. దారుణమైన విషయం ఏంటంటే.. భక్తితో కొలిచే దేవుళ్ల నగలు కూడా దోచుకువెళ్తున్నారు.
ఈ మధ్యకాలంలో కొంతమంది కేటుగాళ్లు ఈజీ మనీ కోసం దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి వాటి కోసం తప్పుదోవ పడుతున్నారు. కొంతమంది ఇల్లు, షాప్, గుడి, బడి తేడా లేకుండా అన్నింటినీ దోచేస్తున్నారు. గుళ్లో దేవతా విగ్రహాలను కూడా తస్కరిస్తున్నారు. కంచె చేను మేస్తే.. అన్న రీతిలో శ్రీరామ మందిరంలో 400 ఏళ్లనాటి సీతారాముల విగ్రహాలను మాయం చేసిన పూజారి ఉదంతం ఆగ్రాలో చోటుచేసుకుంది. శ్రీరామ మందిరంలోని నాలుగు విగ్రహాలు మాయం చేసిన పూజారిపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆగ్రాలోని జాత్పురా ప్రాంతంలోని శ్రీరామ మందిరంలో 400 ఏళ్ల నాటి నాలుగు విగ్రహాలు మాయమయ్యాయి. ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు అందరు ఆలయ పూజారి మరియు అతని భార్యపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆలయ కమిటీ పూజారి దీప్మణి శుక్లా, అతని భార్యపై ఫిర్యాదు చేశారు. శ్రీరామ మందిరాన్ని మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలోని మంత్రి రాజా తోడర్మల్ నిర్మించారని తెలిపారు. విలువైన లోహాలతో చేసిన శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయుల విగ్రహాలను ప్రతిష్టించారని ఆలయ కమిటీ మేనేజర్ రాందాస్ కటారా చెప్పారు.
విగ్రహాల గురించి ఆలయ కమిటీ సభ్యులు ఆరా తీయగా పూజారి దంపతులు అనుచితంగా ప్రవర్తించారని రాందాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పూజారి ఆచార్య దీప్మణి శుక్లా, ఆయన భార్యపై ఐపీసీ 379, సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆలయ కమిటీ తనపై కక్ష గట్టి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, విగ్రహాల దొంగతనం అంటగట్టారని పూజారి శుక్లా చెప్పుకొచ్చాడు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విగ్రహాల అపహరణపై మీ కామెంట్స్ తెలియజేయండి.