మృత్యువు ఎప్పుడు? ఎవ్వరిని? ఎలా? తన ఒడిలోకి చేర్చుకుంటుందో ఎవ్వరమూ చెప్పలేము. మరణానికి రాజు, పేద తేడా ఉండదు. ఎవరి టైం వచ్చినపుడు వారిని తీసుకెళ్లిపోతుంది. మృతుల ఇంట్లో తీరని విషాదాన్ని మిగిలిస్తుంది. సరదాగా గడుపుదామని బయటకు వెళ్లిన ఓ జంట సంసారం జీవితంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ భర్త కళ్లెదుటే భార్య కన్నుమూసింది. ఈ సంఘటన మేడ్చల్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మేడ్చల్లోని అత్వెల్లికి చెందిన సూరిబాబు, ప్రసన్న భార్యా భర్తలు. వీరికి ఏడాది క్రితం పెళ్లయింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. దాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా జీవించేవారు. అప్పుడప్పుడు సరదాగా బయటకు వెళ్లి షికార్లు చేసేవారు. శుక్రవారం రాత్రి కూడా సరదాగా బయట తిరిగొద్దామని అనుకున్నారు.
స్కూటీపై మేడ్చల్కు బయలు దేరారు. ఈ నేపథ్యంలోనే వీరి వాహనం జాతీయ రహదారిపై అత్వెల్లి ఎన్క్లేవ్ సమీపంలోకి వచ్చింది. అక్కడ ఓ లారీ అతివేగంగా వారివైపు దూసుకువచ్చింది. స్కూటీని ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన వేగానికి ఇద్దరూ గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డారు. సూరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. కానీ, అతడి కళ్లెదుటే రోడ్డుపై పడ్డ ప్రసన్న మీదనుంచి లారీ దూసుకెళ్లిపోయింది. అతడు చూస్తుండగానే ఆమె అక్కడికక్కడే మృత్యువాతపడింది. భార్య చనిపోవటంతో సూరిబాబు బాధకు అడ్డులేకుండాపోయింది. గుండెలవిసేలా ఏడ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.