ప్రేమ అజరామరమైనది అంటారు. ప్రేమని బతికించుకోలేక తమని తాము బలి తీసుకుంటున్న ప్రేమికులకి ఈ విషయం అర్ధం కావడం లేదు. నిజమైన ప్రేమ ప్రాణాన్ని పోస్తుందే గాని.., బలి కోరదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేక తాజాగా ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే…
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన ఏదుల సలేశ్వరంగౌడ్ ఇంటర్ వరకు చదివాడు. ప్రస్తుతం అతను భాగ్యనగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. సలేశ్వరంగౌడ్ కి అదే గ్రామానికి చెందిన ఉడ్తనూరి రాధ పరిచయమైంది. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన రాధ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామంలోనే ఉండిపోయింది. సలేశ్వరంగౌడ్ కూడా కరోనా నేపథ్యంలో ఎక్కువ రోజులు గ్రామంలో ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం పెద్దలకి తెలియడంతో వారు.. వీరి ప్రేమకి నిరాకరించారు. దీనికి కారణం అబ్బాయి కన్నా.. అమ్మాయి 4 సంవత్సరాలు పెద్దది కావడమే.
ఇదే సమయంలో రాధకు ఆమె తల్లిదండ్రులు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు. దీంతో.., సలేశ్వరంగౌడ్ నాలుగు రోజుల కిందట హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చి రాధను తన వెంట తీసుకెళ్లిపోయాడు. వీరిద్దరూ దూరంగా వెళ్ళిపోయి.., పెళ్లి చేసుకుని ఉంటారని గ్రామస్థులు, కుటుంబీకులు భావిస్తూ వచ్చారు. కానీ.., ఆదివారం సాయంత్రం నల్లమల అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుతున్న కాపరులకు రామచంద్రికుంట సమీపంలో వీరిద్దరూ ఉరి వేసుకుని కనిపించారు. దీంతో.., సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పెద్దలను పెళ్ళికి ఒప్పించలేక, వారిని ఎదిరించి పెళ్లి చేసుకుని జీవించే శక్తి లేక ఈ జంట ఆత్మహత్యకి పాల్పడినట్టు తెలుస్తోంది. మరి.. ఈ విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.