ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి డిప్రేషన్ లోకి వెళ్తున్నారు. క్షణికావేశంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబాలకు తీరని దుఖాఃన్ని మిగుల్చుతున్నారు.
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఎదుటివారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, ప్రేమికుల మద్య వచ్చే గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రేషన్ లోకి వెళ్లి క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ ప్రేమికుడు తాను ప్రేమించిన యువతి దూరం పెట్టిందనే కోపంతో అతి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన జరిగి రెండేళ్లయ్యింది.. కానీ ఆ యువతికి న్యాయం ఇప్పుడు జరిగింది. వివరాల్లోకి వెళితే..
భారత్ నుంచి ఎంతోమంది ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే జాస్మిన్ కౌర్ అనే 21 ఏళ్ల యువతి నర్సింగ్ చదువు కోసం ఆస్ట్రేలియా కి వెళ్లింది. అక్కడే తారిక్ జోత్ సింగ్ అనే ఓ యువకుడిని ప్రేమించింది. కొన్నిరోజుల తర్వాత తారీక్ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి.. జాస్మిన్ కి తారిక్ కి మద్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి. దీంతో జాస్మిన్.. తారిక్ ని దూరంగా పెడుతూ వచ్చింది. ఇది సహించలేకపోయిన తారిక్ ఆమెను చంపేయాలని నిశ్చయించుకున్నాడు. జాస్మిన్ పనిచేస్తున్న చోటు నుంచి ఆమెను కిడ్నాప్ చేశాడు. కారులో బంధించి దాదాపు నాలుగు గంటలు ప్రయాణించి ఫ్లిండర్స్ రేంజ్స్ కి చేరుకున్నాడు. అక్కడే జాస్మిన్ ని అత్యంత క్రూరంగా చంపాడు. కళ్లకు గంతలు కట్టి, కాళ్లూ చేతులు కేబుల్ వైర్ తో కట్టేసి ఆమె బతికి ఉండగానే సమాధి చేశాడు. ఈ ఘటన మార్చి 2021 లో జరిగింది.
అప్పట్లో ఈ ఘటనపై మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.. తర్వాత దర్యాప్తులో ఆమెది హత్య అని తేల్చారు పోలీసులు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తారీక్ జోత్ సింగ్ దోషిగా తేలింది. బుధవారం వాదనలు విన్న స్థానిక కోర్టు అతనికి వికృత చర్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అతనిది ప్రతీకార చర్యగా తేల్చడంతో పాటు జీవిత ఖైదు పడొచ్చని తేల్చి చెప్పింది. ఒక మనిషిలో మృగ స్వభావం ఏ మేరకు ఉంటుందో తారీక్ ని చూస్తే అర్థం అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా జాస్మిన్ తల్లి మాట్లాడుతూ.. తమ కూతురిని విదేశాలకు పంపించింది తప్పు చేశామని.. ఉన్నత చదువుల కోసం వెళ్లి మళ్లీ కనిపించకుండా పోయింది. తాను ఎంత వారించినా తారీక్ తన కూతురుని వదల్లేదని.. అతను చేసిన నేరానికి క్షమాపణే ఉండదని కన్నీరు పెట్టుకుంది. జాస్మిన్ ని ఎక్కడైతే పూడ్చి పెట్టాడో అక్కడే ఆమెకు సమాధి కట్టి ప్రార్థనలు ద్వారా నివాళులరిస్తూ వస్తుంది ఆమె కుటుంబం.