ప్రమాద బీమా అంటే రోడ్డు, వాహన ప్రమాదాలు జరిగితేనే వర్తిస్తుందన్నది ప్రజలలో ఉన్న భావన. అది వాస్తవమే అయినా.. ఏ రకమైన ప్రమాదం జరిగినా బీమా వర్తింపజేసే రెండు పథకాలను తపాలా శాఖ తీసుకొచ్చింది. అంటే.. అంగవైకల్యం కలిగినా, పాము కాటుతో మరణించినా, విద్యుత్తుషాక్తో మరణించినా బీమా వర్తిస్తుందన్నమాట. అది కూడా అతి తక్కువ ప్రీమియంతో.. అంతేకాదు.. గాయపడి ఆస్పత్రిలో ఇన్పేషెంట్గా చేరితే ఖర్చుల కోసం రూ.60వేలు, అవుట్ పేషెంట్గా చికిత్స తీసుకొంటే రూ. 30వేలు వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రజలు అధికసంఖ్యలో ఈ బీమా చేయించుకొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇంతకీ ఈ పాలసీ ఏంటి..? ఎలా చేరాలి..? ప్రయోజనాలేంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యతరగతి ప్రజలు వేలకు.. వేలు.. పెట్టి బీమా పాలసీలు తీసుకోలేం.. పోనీ, తీసుకున్నా ప్రతి ఏడాది ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది కనుక రెండు.. మూడు సంవత్సరాలు గడిచాక మనకెందుకులే అని వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికోసమే ఇండియా పోస్ట్ అత్యంత చవకైన బీమా పాలసీలను తీసుకొచ్చింది. ఏడాదికి రూ.299, రూ.399కే ప్రమాద బీమా పాలసీలను తీసుకొచ్చింది. ఈ పాలసీలు అందించే ప్రయోజనాలు అద్భుతమైనవని చెప్పాలి. కరోనా తర్వాత ఆరోగ్య బీమా చేయించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పాలసీలను తీసుకొచ్చారు. ఇందుకోసం పోస్టల్ శాఖ టాటా ఏఐజీతో కలిసి పనిచేస్తున్నది.
ఈ పాలసీ ప్రీమియం ఏడాదికి రూ.399. 18 నుంచి 65ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇందులో దాదాపు 10 రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఏదేని ప్రమాదంలో మరణించినా/ శాశ్వత పాక్షిక అంగవైకల్యం చెందినా/ పక్షవాతం వచ్చినా.. రూ.10 లక్షల వరకు బీమా చెల్లిస్తారు. ఒకవేళ ప్రమాదంలో పాలసీదారుడు గాయపడి ఆస్పత్రిలో ఇన్పేషెంట్గా చేరితే ఖర్చుల కోసం రూ.60వేలు, అవుట్ పేషెంట్గా చికిత్స తీసుకొంటే రూ. 30వేలు చెల్లిస్తారు. ఒకవేళ ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే రోజుకు రూ.1000 చొప్పున పది రోజులు ఇస్తారు. వీటితో పాటు రవాణా ఖర్చుల కింద రూ.25,000, అంత్యక్రియల కోసం రూ.5000 అందిస్తారు. అలాగే, విద్యా ప్రయోజనం కింద గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు రుసుములో 10 శాతం లేదా లక్ష రూపాయల వరకు మీకు నచ్చినది ఎంచుకోవచ్చు.
ఈ పాలసీ ప్రీమియం ఏడాదికి రూ.299. కొన్ని ప్రయోజనాలు మినహాయించి ఇది కూడా దాదాపు రూ. 399 పాలసీ ప్రయోజనాలన్నింటిని అందిస్తుంది.ఏదేని ప్రమాదంలో మరణించినా/ శాశ్వత పాక్షిక అంగవైకల్యం చెందినా/ పక్షవాతం వచ్చినా.. రూ.10 లక్షల వరకు బీమా చెల్లిస్తారు. ఒకవేళ గాయపడి ఇన్పేషెంట్గా చేరితే ఖర్చుల కోసం రూ.60వేలు, అవుట్ పేషెంట్గా చికిత్స తీసుకొంటే రూ. 30వేలు చెల్లిస్తారు. ఇవి మినహా.. బెడ్ ఖర్చులు, పిల్లల చదువుకోసం ఇచ్చే ప్రయోజనాలు, అంత్యక్రియల ఖర్చులు, రవాణా ఖర్చులు వంటివి ఈ పథకంలో లేవు. ఈ పాలసీలు తీసుకోవాలనుకొనేవారు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కోవిడ్ వంటి మహమ్మారి మరేదైనా.. ఎపుడైనా పుట్టుకురావచ్చు. అలాంటి పరిస్థితే వచ్చే ప్రాణాలను కాపాడుకోవడం మధ్యతరగతి ప్రజలకు తలకు మించిన కష్టం. అలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే.. ఏదేని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.