వైఎస్సార్ జిల్లా, పులివెందులకు చెందిన వైసీపీ నేత, జగన్ సమీప బంధువు వైఎస్ కొండా రెడ్డిని జిల్లా నుంచి బహిష్కరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ఎస్పీ.. కలెక్టర్కు సిఫారసు చేసినట్లు సమాచారం. సీఎం జగన్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ బెదిరింపుల ఘటనకు సంబంధించి లక్కిరెడ్డిపల్లె కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరైన కొద్దిసేపటికే ఇలాంటి వార్తలు రావడంతో వైసీపీ పార్టీలో కాస్త అలజడి రేగింది.
వైఎస్ కొండారెడ్డి స్వతహాగానే దూకుడు స్వభావం గల వ్యక్తి. అయన పేరు చెబితేనే మనకెందుకులేబ్బా అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా అంటుంటారు. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం వైసీపీ ఇన్చార్జ్గా ఉన్న వైఎస్ కొండారెడ్డిని.. ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్లను బెదిరించిన కేసులో పోలీసులు ఆయనను రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఆయనను లక్కిరెడ్డి పల్లె కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అయితే వైఎస్ కొండా రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా.. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రాయచోటి సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ వ్యవహారమంతా జగన్ దృష్టికి వెళ్లడంతో జిల్లా నుంచి బహిష్కరించాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ జగన్ సన్నిహితుడు బహిష్కరణకు గురికావడం అన్నది వైసీపీకి కాస్త మైనస్ గానే చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: Narayana : నారాయణ అరెస్ట్ నుండి బెయిల్ వరకు.. పూర్తి వివరాలు!
కేసు వివరాలను పరిశీలిస్తే.. చాగలమర్రి – రాయచోటి మధ్య 143 కిలోమీటర్లను.. కేంద్రం నేషనల్ హైవేగా గుర్తించి రూ. 350 కోట్లు కేటాయించింది. గుత్తేదారు రవి కుమార్ రెడ్డికి చెందిన ఎస్ఆర్ కే కన్స్ట్రక్షన్స్ సంస్థ 30 శాతం లెస్ తో టెండర్ దక్కించుకుని పనులు చేపట్టింది. చక్రాయపేట పరిధిలో నాలుగు కిలోమీటర్ల పొడవున్న రహదారి పనుల్లో తనకు భాగస్వామ్యం ఇవ్వాలని కొండారెడ్డి డిమాండ్ చేశాడు. లేదంటే పనులు జరగనివ్వం అని బెదిరించాడు. దీనిపై సదరు కంపెనీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు సదరుఈ వ్యక్తిని కొండారెడ్డిగా గుర్తించి అరెస్టు చేశారు.