తెలుగు దేశం పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఒకరు సోమవారం ఉదయం కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఆ వివరాలు.. టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు సోమవారం ఉదయం కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని కుమార్తె నివాసంలో తుది శ్వాస విడిచారు. వెంకట్రావు మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ పార్టీ నేతలు సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మరణం పార్టీకి లోటని వ్యాఖ్యానించారు. యడ్లపాటి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు నాయకుడిగా పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారన్నారు.
యడ్లపాటి వెంకట్రావు 1919 డిసెంబర్ 16న గుంటూరుజిల్లా అమృతలూరు మండలంలోని బోడపాడులోని రైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు యడ్లపాటి వెంకట సుబ్బయ్య, రాఘవమ్మ. ఆయన గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ చదివారు.. తర్వాత మద్రాసు లా కాలేజీలో చదువుతూ అందులో ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత న్యాయవాద వృత్తిని ఎంచుకుని.. న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఆయన అలవేలు మంగమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అంతేకాదు యడ్లపాటి వెంకట్రావు ప్రముఖ రైతు నాయకుడు ఎన్.జి.రంగా ముఖ్య అనుచరుడిగా.. ఆయనతో కలిసి నడిచారు. ఎన్.జి రంగాతో కలిసి 1951లో కృషీకార్ లోక్ పార్టీ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారు.