రాయలసీమ అంటే రత్నాల సీమ అనేది ఒకప్పుడు రాజుల కాలంలో వాడిన మాట. తరువాతి కాలంలో వానలు లేక, నీటి చుక్కకోసం అల్లాడే జనంతో కరువు సీమాగా మారింది. అప్పటి నుంచి రాయలసీమ పేరు వస్తే చాలు కరువుకు కేరాఫ్ అయింది. అసలు ఇక్కడ వానలు కురిస్తే దేవుడు కరణించాడు అనే భావన ఇక్కడి ప్రజల్లో కలుగుతుంది. ఇంక చెరువులు, కుంటలు నిండాయి అంటే అది అద్భుతమే..ఇలాంటి కరువు చరిత్ర కలిగిన రాయలసీమలో గత రెండు రోజులగా కరుస్తోన్న వర్షాలను చూస్తుంటే..అసలు ఇది రాయలసీమేనా అనే సందేహం కలుగుతుంది.
గత 40ఏళ్లలో ఎప్పుడూ చూడని జలప్రళయం రాయలసీమలో కనిపించింది. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలో వచ్చిన జలప్రళయమే దీనికి సాక్ష్యం. ఈ మూడు జిల్లాలో ఏ ప్రాంతంలో చూసిన సగటున 100 మి.మీ.పైనే వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 540.6 మి.మీ. వర్షం పడిందంటే వరద ప్రభావం రాయలసీమపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాయలసీమ జిల్లాల్లో చాలా గ్రామాలకి గ్రామాలే తుడిచిపెట్టకొని పోయాయి.
అనంతపురం జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో దీపారాధనకు వెళ్ళిన భక్తులు, పూజారి వరదలో చిక్కుకొని గల్లంతయ్యారు. ఒక్కసారిగా వచ్చిన వాగు శివాలయాన్ని చుట్టు ముట్టింది. కడప జిల్లా నందలూరు సమీపంలో బస్సులు చెయ్యేరు నదిలో చిక్కుకుని కొందరు మృతిచెందగా…మరికొందరు గల్లంతయ్యారు. అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగి దిగువు ప్రాంతంలోని ఊర్లు నీట మునిగాయి. తిరుమల శ్రీవారి మెట్ల మార్గం మొత్తం పెద్ద పెద్ద బండరాళ్లు పడి పూర్తిగా దెబ్బతింది. తిరుపతి నది ఒడ్డున ఉన్నదా అన్న స్థాయిలో వరదలు నగరాన్ని ముంచెత్తాయి. ప్రస్తుతం నెలకొన్న జల విలయం కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.
కరువు సీమగా రాయలసీమకు పేరు. కానీ ఈ రెండు రోజులగా కురుస్తోన్న వానలను చూస్తుంటే.. రాయలసీమ చరిత్రలో గుర్తుండిపోయేది.వరుణుడి ఉగ్రరూపానికి రాయలసీమ చీమలాగా చితికిపోయింది. పెన్న నది ఉప్పొంగటంతో పరిసర ప్రాంతాలు మునిగాయి… ప్రత్యేక హెలికాప్టర్ల లో ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పై అధికారులతో చర్చించనున్నారు.