ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలను చేపట్టింది. ఇప్పటికే దాదాపు 18 లక్షలకు పైగా ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణ పనుల్లో కదలిక తెచ్చేందుకు లబ్థిదారులకు అడ్వాన్స్ గా రూ. 20 వేలు ప్రభుత్వం అందించనుంది.
సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి సామాన్యుడి కల. కనీస అవసరాల్లో ఒకటైన గృహం నిర్మించుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటాడు. పైసా పైసా కూడబెట్టుకొని ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ పెరుగుతున్న ఖర్చులు, చాలీ చాలని జీతాలు వారి ఆలోచనను ముందుకు సాగనివ్వడం లేదు. ఇప్పటి వరకు కూడా సొంత ఇళ్లు లేని పేదలు చాలామందే ఉన్నారు. వీరందరిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లు కట్టుకుంటామనుకునే వారికి అడ్వాన్స్ గా రూ. 20వేలు ఇచ్చేందుకు ఆలోచన చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సొంత ఇల్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. రూ. 1.80 లక్షల ఆర్థిక సాయంతో ఇళ్లు నిర్మించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల పైగా ఇళ్లు వివిద దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇంటి నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు అడ్వాన్సుగా రూ. 20వేలు ఇస్తామంటూ ప్రభుత్వం తెలియజేసింది. కానీ ఇది ప్రభుత్వం ఇస్తున్న రూ. 1.80లక్షల సాయానికి అదనంగా మాత్రం కాదు. ఆ మొత్తంలో నుంచే ఈ 20 వేల రూపాయలను మినహాయిస్తారు. మరో కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది.