ఈ రోజుల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సొంత ఇల్లు కట్టుకోవాలంటే పెరుగుతున్న ధరలతో తలకు మించిన భారం అవుతోంది. భూ తగాదాలతో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒక గజం స్థలం కొనాలంటే వేలల్లో ధర పలుకుతుంది. సొంత ఇల్లు నిర్మించుకునేవారికి చాలా భారమవుతోంది. ఆస్తుల కోసం అన్నదమ్ములను, అక్కాచెళ్లెల్లను కూడా పక్కన పెట్టే రోజులివి. ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ములైనా భూముల కొరకు కొట్లాడుకుంటున్నారు. భూమి పంచాయతీలు గొడవలుగా మారి హత్యలు చేసుకునే వార్తలు కూడా నిత్యం మనం వింటూనే ఉన్నాం. ప్రతి కుటుంబంలో అంగుళం జాగా కూడా వదలకుండా పంచుకుంటున్నారు. భూ తగాదాలు ఒక్కోసారి రక్తపాతాలను కూడా సృష్టిస్తాయి. అలాంటిది ఓ పెద్దమనిషి తనవద్ద ఉన్న 5 ఎకరాల భూమిని ఊరిలోని పాఠశాలకు దానంగా ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నాడు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలోని కుందర్పి గ్రామానికి ఇటీవల గురుకుల పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గురుకుల స్కూల్ మంజూరు అయింది కానీ బడి నిర్మించుటకు సరిపడా స్థలం లేక అధికారులు తలలు పట్టుకున్నారు. స్థలం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసి అదే గ్రామానికి చెందిన జిన్నా ఓబులేసు స్కూల్ కట్టడానికి తన పేరిట ఉన్న 5 ఎకరాల భూమిని దానంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఓబులేసు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన కుటుంబసభ్యులు కూడా సమర్థించారు. పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓబులేసు చెప్పాడు. వెంటనే తన భార్యతో తహశీల్దార్ ఆఫీస్కు వెళ్లి భూమికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందించారు.
గ్రామంలోని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు పెద్ద మనసు చేసుకుని తన భూమిని ఇచ్చిన ఓబులేసును గ్రామస్తులు, అధికారులు, చుట్టుపక్కల గ్రామస్తులు అభినందించారు. పెద్దాయన మంచితనాన్ని కొనియాడుతున్నారు. పదిమందికి ఆదర్శంగా నిలిచిన ఓబులేసుకు ఊరిలోని వారందరు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దీనిపై మీ కామెంట్స్ తెలయజేయండి.