బెండపూడి విద్యార్థులు మాట్లాడే ఇంగ్లీష్ చూసి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీష్లో గలగలా మాట్లాడేస్తున్న ఆ విద్యార్థులను చూసి ముచ్చటపడుతున్నారు. అసలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లలో చదువుతున్న చాలా మంది పిల్లలు కూడా బెండపూడి స్కూల్ విద్యార్థుల అంత చక్కని యాక్సెంట్లో మాట్లాడలేరు. మరి లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికి సాధ్యం కానిది.. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎలా సాధించారు.. సీఎం జగన్ సైతం ప్రశంసలు కురిపించారు.. వీరు ఇంత బాగా మాట్లాడ్డానికి కారణం ఎవరు.. ఈ విద్యార్థులు సాధించిన విజయం వెనక ఉన్నది ఎవరు అంటే.. ప్రసాదరావు మాస్టార్. అసలు ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చింది వంటి తదితర వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రసాదరావు.. ప్రస్తుతం బెండపూడి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ట్రైనర్గా పని చేస్తున్నారు. ఇక ఈ ప్రయత్నం వెనక ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటలు ఉన్నాయి. ఆయనకు ఎదురైన అవమానాల నుంచి.. ఈ గొప్ప ఆలోచన పుట్టుకొచ్చింది అన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్రావు మాట్లాడుతూ.. ‘‘నేను చదువుకునే రోజుల్లో.. మా స్కూల్కి వెళ్లేటప్పుడు కొన్ని కార్పొరేట్ పాఠశాలల ముందు నుంచి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ చదివే పిల్లలను, వారు మాట్లాడే ఇంగ్లీష్ చూస్తే భయం వేసేది.. జీవితంలో ఒక్కసారైనా వీళ్లలా మాట్లాడగలనా అనుకునేవాడిని’’ అని చెప్పకొచ్చారు.
‘‘ఇంగ్లీష్ రాకపోవడం వల్ల జీవితంలో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ సంఘటనల తర్వాత ఇంగ్లీష్ రాకపోతే ఇంత చిన్నచూపు చూస్తారా అని అనిపించింది. ఆ కసి, పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నాలా విద్యార్థులు బాధపడకూడదని ఎంతో ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చానని’’ తెలిపారు ప్రసాద్ రావు. ఇక తాను విద్యార్థులకు ఎలా ట్రైనింగ్ ఇస్తారో ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ప్రసాదరావు. ‘‘ముందు భయపడకుండా మాట్లాడమని స్టూడెంట్స్కి సూచిస్తాం. ఆ తర్వాత వారు చేసే తప్పులను సరి చేస్తాం.
ముందు వారిలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతామని’’ తెలిపారు. అలానే అమెరికన్ యాక్సెంట్ కోసం విద్యార్థులకు తాను ఎలా ట్రైనింగ్ ఇస్తారో తెలిపారు. ఇక ప్రసాద్రావు చేసిన కృషిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి టీచర్ ప్రతి స్కూల్లో ఉంటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు లభిస్తుందంటున్నారు నెటిజనులు.