ప్లాస్టిక్ వినియోగం వలన ఏ స్థాయిలో పర్యావరణందెబ్బ తింటుందో అందరికి తెలిసిందే. అందుకే ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టికి వినియోగం తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటాయి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వాలు పలు రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీ జరిమానాలను విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ రూల్స్ లో సవరణలు తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అటవీ పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణ కాలుష్యం సృష్టించే వారే ఈ ఖర్చును కూడా భరించాలన్న సూత్రం ఆధారంగా జరిమానాలు విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు వేసేందుకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తులను దిగుమతి, తయారీపై మొదటి తప్పుగా పరిగణిస్తే రూ.50 వేలు, రెండో సారి రూ. లక్ష జరిమానా విధించాలని సర్కారు ఆదేశించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిల్వచేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో వారికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. అలానే సీజ్ చేసిన ఉత్పత్తులపై కిలోకి రూ.10 చొప్పున జరిమానా వేయనున్నారు. ఇక వీధి వ్యాపారుల విషయానికి వస్తే.. వాళ్లు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లను వినియోగిస్తే రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించాలని ఏపీ సర్కార్ ఆదేశాల్లో పేర్కొంది.
ఇక పెద్ద పెద్ద దుకాణాలు, సంస్థలు , షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులను అమ్మినట్లయితే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు జరిమానా విధించనున్నారు. అంతేకాక అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ మరికొన్ని కీలక అంశాలను జారీ చేశారు. పాలిథిన్ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, అమ్మకాలు, ఈ-కామర్స్ కంపెనీలపై దృష్టి పెట్టాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ వినియోగంపై పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలని స్పష్టం చేసింది.