మహారాష్ట్ర- మవోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో జరిగిన ఎన్ కౌంటర్ లో భారీ స్థాయిలో నక్సల్స్ చనిపోయినట్లు తెలుస్తోంది. గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మరణించారని సమాచారం. గడ్టిరోలి జిల్లాలోని గారపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్డింటొల అడవి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండే గడ్చిరోలి జిల్లాకు చెందిన యాంటీ మావోయిస్టు స్క్వాడ్ కు సంబందించిన సీ 60 ఫోర్స్ జవాన్లు అదనపు ఎస్పీ సౌమ్య ముండే నేతృత్వంలో కూంబింగ్ విధులు నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని, వెంటనే జవాన్లు ప్రతిస్పందించారని అధికారులు చెప్పారు. నాగపూర్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు.
ఎన్ కౌంటర్ జరిగిన సంఘటన స్థలానికి అదనపు పోలీసు బలగాలను పంపించినట్లు గడ్చిరోలి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అంకిత్ గోయల్ చెప్పారు. ఈ ఎన్ కౌంటర్లో 26 మంది మావోయిస్టులు చనిపోయారని, మర్డింటొల అడవిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలను గడ్చిరోలి తరలించి, పోస్ట్ మార్టంకు పంపిస్తామని అన్నారు.
ఈ ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్ట్ కమాండర్, సెంట్రల్ కమిటీ మెంబర్ దిలీప్ టెల్టుంబ్డే కూడా ఉన్నట్లు సమాచారం. ఎన్ కౌంటర్ జరిగిన సంఘటన స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు తెలుల్తోంది. చికిత్స కోసం వీరిని హెలికాప్టర్ ద్వారా నాగపూర్ తరలించామని గడ్చిరోలి పోలీస్ కంట్రోల్ రూం తెలిపింది.