ఎస్.ఎస్. రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన దర్శక ధీరుడు. బాహుబలి తరువాత జక్కన్న నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు. ఇందుకే రాజమౌళి తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ టాప్ హీరోలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.., ఇంత సాధించినా.., రాజమౌళి మాత్రం తెలుగు సినిమాపై, తెలుగు హీరోలపై తన ఇష్టాన్ని తగ్గించుకోలేదు. బాహుబలి తరువాత వేల కోట్ల బడ్జెట్ తో.., పదుల కొద్దీ అవకాశాలు వచ్చినా.., మళ్ళీ యన్టీఆర్, చరణ్ లతోనే ట్రిపుల్ ఆర్ కి కమిట్ అయ్యాడు రాజమౌళి. ఇప్పుడు ఆ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీని తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ తో ఓ అడ్వెంచర్స్ మూవీని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే.., ఇప్పుడు ఈ మూవీ కోసం రాజమౌళి ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కరోనా కాలంలో ట్రిపుల్ ఆర్ తో రాజమౌళి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చాలాసార్లు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. కానీ.., మహేశ్ మూవీ విషయంలో ఇలాంటి అంతరాయాలు కలగకుండా మాస్టర్ ప్లాన్ వేశాడట జక్కన్న.
మహేష్ సినిమాని ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో విజువల్ వండర్ గా తీర్చిదిద్దబోతున్నాడట దర్శక ధీరుడు. సినిమాలో సింహ భాగం షూటింగ్ ఇక్కడే ఉండబోతుంది. ఇందుకే ఈ మూవీ షూటింగ్ బయో బబుల్ లో చేయాలన్న నిర్ణయానికి వచ్చాడట జక్కన్న. అంటే.., ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహించే ఫ్రాంచైజీలు ఎలా అయితే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బయో బబుల్ లో ఉంటాయో అలా అనమాట. తన టీమ్ మొత్తాన్ని అక్కడి అడవుల్లో బయో బబుల్ లో ఉంచి షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడట జక్కన్న. ఇందుకోసం అక్కడే అన్నీ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారట. అలాగే.., లైట్ బాయ్ నుండి స్టార్ కాస్ట్ వరకు అందరికీ నిరంతరం టెస్ట్ లు జరిపిస్తూ.. షూటింగ్ నిరంతరాయంగా కొనసాగే చర్యలు తీసుకోబోతున్నాడట జక్కన్న. ఇక ఈ సినిమా కథ విషయంలో కూడా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చత్రపతి శివాజీ మహరాజ్ ని ఆదర్శంగా తీసుకుని ఇందులో హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేశారట. రచయిత విజయేంద్ర ప్రసాద్ అందుకు సంబంధించిన కథను ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇలా మహేష్ తో మూవీ కోసం జక్కన్న ఇంత ముందుగానే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకోవడం ఫ్యాన్స్ ని సైతం షాక్ కి గురి చేస్తోంది.