ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, మద్యంతాగి వాహనం నడపడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 29 మందికి గాయపడ్డారని సమాచారం. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వికారాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్.. తాండూరు నుంచి వికారాబాద్ కు వెళ్తుంది. ఈ క్రమంలో అనంతగిరి గుట్ట సమీపంలో మైసవ్వ చిన్న గుట్ట వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 29 మందికి ప్రయాణికులకి గాయాలైనట్లు తెలుస్తోంది. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులతో కలిసి పోలీసులు గాయపడ్డ ప్రయాణికులను వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో లోయలో పడిపోయిన బస్సును బయటకి తీశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.