ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. నవమాసాలు మోసి, కనిపెంచిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. నిత్యం బిడ్డల యోగక్షేమాల కోసం తల్లి పరితపిస్తుంది. వారు పెద్దై ఓ ఇంటి వారైతే చూడాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అంతలా తమని పెంచిన తల్లిపై కొందరు పుత్రులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 70 ఏళ్ల వయస్సు, పక్షవాతం వల్ల ఎడమకాలు, చేయి పనిచేయని వృద్ధ తల్లిని బరువుగా భావించారు ఆమె పుత్రరత్నాలు. అంతేకాక నడవలేని స్థితిలో ఉన్న ఆమెను రైలెక్కించి ముఖం చాటేశారు.. ఆ కసాయి కొడుకులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చిన విశాఖపట్నం-కాచిగూడ రైలులో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని ఆ స్టేషన్ సిబ్బంది గుర్తించారు. ఆమె ఒంటిపై దుస్తులు సరిగ్గాలేవు, ఆమె మానసిక స్థితి కూడా అంతంతమాత్రంగా ఉంది. 70 ఏళ్ల వయస్సున ఆమెకు పక్షవాతం వల్ల ఎడమకాలు, చేయి పనిచేయడంలేదు. రెండు అడుగులు వేయలేని నిస్సహాయత స్థితిలో ఆమె ఉంది. ఆ వృద్ధురాలి పరిస్థితి చూసిన రైల్వే సిబ్బందికి మనసు కలచివేసింది. ఆమెకు ఆహారం అందించి తరువాత సపరివర్యలు చేశారు. అనంతరం ఆమెను వివరాలు అడగ్గా .. కొడుకుల క్రూరత్వం వెలుగులోకి వచ్చింది. తన పేరు జొన్నలగడ్డ లక్ష్మి అని, తనది కృష్ణాజిల్లా పునాదిపాడు గ్రామం అని తెలిపింది. తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని తెలిపింది. వారే గుంటూరు సమీపంలో తనను ఈ రైలులోకి ఎక్కించినట్లు ఆమె తెలిపింది. రైల్వే సిబ్బంది మహబూబునగర్ లోని ‘సఖీ’ కేంద్రంకి సమాచారం అందించారు.
దీంతో సఖీ కేంద్ర కౌన్సిలర్ మహిమ, కానిస్టేబుల్ లక్ష్మి దివిటిపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఆ పెద్దావిడకు దుస్తులు తొడిగి..స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆమెకు మెదడులోని కొన్ని నరాల్లో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. ఆమె దీనస్థితిని చూసిన కొందరు ఆమె కొడకులను తిట్టిపారేస్తున్నారు. ‘నవమాసాలు మోసి..కని పెంచిన తల్లి.. నడవలేని దుర్భరమైన స్థితిలో ఉంటే కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కుమారులు నిర్దాక్షిణ్యంగా వదిలించుకన్నారు. దుర్భరమైన స్థితిలో ఉన్న ఆమెను రైలు ఎక్కించి పంపించాడానికి..వారికి మనస్సుల ఎలా వచ్చింది. వారి కుమారులకు నేర్పే మంచి ఇదేనా?’ అంటూ కొందరు పెద్ద ఎత్తున వారిపై విమర్శలు గుప్పించారు. ‘కర్మకు ప్రతిఫలం అనుభవించక తప్పదులే’ అని మరికొందరు కర్మసిద్దాతాన్ని ప్రస్తావిస్తున్నారు.