మరో ఐదు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్నికల ముందు కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తోంది. ఆ వివరాలు..
మరో ఐదు నెలల్లో తెలంగాణలో అసెబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి కూడా విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు ఉండటంతో.. సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజాకర్షక పథకాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా.. వచ్చే నెల నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు ఇప్పటికే మంత్రి తలసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 5న నల్గొండలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రెండో విడతలో 3.50 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. పోడుపట్టాలు పొందిన గిరిజనులందరికీ రైతు బంధు సైతం అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. దీనివల్ల పోడు రైతులకు కూడా మేలు జరగనుంది.
ఇక తాజాగా కులవృత్తులతో జీవనోపాధి పొందుతున్న ఎంబీసీ, బీసీలకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కులవృత్తుల మీద ఆధారపడ్డ లక్షన్నర మందికి ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు గాను ప్రతి నియోజకవర్గంలో 1200-1500 మందిని ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇలా ఎంపిక చేసిన వారికి ఎలాంటి గ్యారంటీ లేకుండా పూర్తి సబ్సిడీతో రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పథకాన్ని ప్రకటించి.. తొలి విడతలో భాగంగా లబ్ధిదారులకు ఈ మొత్తాన్ని అందించనుంది. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సహాయం తదితర విధివిధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం సమక్షంలో సమావేశం అయ్యి.. ఈ పథకానికి సంబంధించి తుది విధివిధానాలు ప్రకటించనున్నారు. ఎంబీసీ, బీసీ కులాల్లోని నాయీబ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, విశ్వబ్రాహ్మణులు, రజక, పూసల వర్గాలతో పాటు.. మరిన్ని కులాలను గుర్తించిన ఉపసంఘం ఇందుకు సంబంధించిన వివరాలను సీఎం అధ్యక్షతన జరిగే సమావేశంలో వెల్లడించనుంది. అర్హులైన కులవృత్తులు చేసుకుంటున్న కుటుంబాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంపిణీ చేయనుంది. మరి కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.