తెలంగాణ సర్కార్ ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికి సహకారం చేకూరేలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. తాజాగా వారికి ఓ తీపికబురు అందించింది. వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కార్డ్తోపాటుగా కొన్ని సదుపాయాలను కల్పించింది.
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. ఈ ఏడాది కూడా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో చేనేత వారోత్సవాలు జరుపనున్నారు. చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన ఆగస్టు 7 నుంచి 14వ తేదీ వరకు పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నేతన్నలకు సంక్షేమ కార్యక్రమాలను అందించనున్నట్లు జౌళిశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మగ్గాల నవీకరణ, నేతన్నలకు ఆరోగ్యకార్డు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ప్రతి సంవత్సరం రూ. 95 కోట్ల రుణం, చేనేత మ్యూజియం, కన్విన్షన్ సెంటర్ వంటివి సంక్షేమ కార్యక్రమాల్లో ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
చేనేత కార్మికులకు, చేనేత వృత్తి పనిచేసుకుంటున్నవారికి కంటి, ఎముకలు, డయాబెటీస్, బ్లడ్ప్లెషర్ వంటి వాటికి హెల్త్ కార్డు ద్వారా చికిత్స అందించబడును. ప్రతి చేనేత ఫ్యామిలీకి ఏటా రూ.25వేల పరిమితి వరకు వైద్య సదుపాయం కలదు. నేతన్నలకు చేయూత పథకం కింద 8 శాతం వేతనాలను జమ చేస్తే సర్కార్ దానికి డబుల్ అంటే 16 శాతాన్ని వారిపేరిట సేవ్ చేస్తుంది. ఈ పథకాన్ని నేతన్నలకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుంట మగ్గాల స్థానంలో నూతనంగా వస్తున్న ఫ్రేమ్ మగ్గాలను స్థాపించనున్నారు. ఒక్కో ఫ్రేమ్ మగ్గానికి రూ. 38 వేలు. అయితే ఈ పథకానికానికి రూ. 40.50 కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది. చేనేత సంఘాలకు రుణభారం పడకుండా పావలా వడ్డీ కింద రుణాలు ఇవ్వనున్నారు.
దేశంలోనే తొలిసారిగా చేనేత మ్యూజియం ఏర్పాటు చేయుటకు నిశ్చయించారు. దీనికోసం ఉప్పల్లోని శిల్పారామం వద్ద 500 స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈనెల జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేయనున్నారు. చేనేత వస్త్రాల బిజినెస్ నిర్వహణ, క్రయవిక్రయదారుల సమావేశాలు నిర్వహణ కొరకు చేనేత కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించనున్నారు. దీని కోసం ఉప్పల్ భగాయత్లో 2,375 గజాల స్థలాన్ని కేటాయించారు. చేనేత కార్మికులకు చనిపోతే ఇచ్చే పరిహారం రూ. 12,500 నుంచి రూ. 25 వేలకు పెంచారు. చేనేత సంఘాలు వ్యాపార క్రయవిక్రయాలను కొనసాగించుటకు డీసీసీబీలు క్యాష్ క్రెడిట్ను అమలు చేయనున్నారు.
‘చేనేత మిత్ర’ పథకం కింద నూలు, రంగులు, రసాయనాలకు 40 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇకపై జియో ట్యాగ్ ఉన్న చేనేత మగ్గాలపై పనిచేసే కార్మికులకు నెలకు రూ.3000 వారి అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించారు. గత ఆగస్టు నుండి 59 ఏళ్లలోపు ఉన్న వారికి నేతన్న బీమా పథకం అమలవుతుంది. ఇకపై 60 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వయసు గల వారికి వర్తింపజేయనున్నారు. పోచంపల్లలో మూతపడిన చేనేత పార్కును బ్యాంకులు వేలం వేయగా టెస్కో ద్వారా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దీనిని దేశంలోనే అతిపెద్ద చేనేత పార్కుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు.