తెలుగు భాష క్రమంగా తన ఉనికిని కోల్పోతోంది. చదువుతో పాటు అన్నింటా ఆంగ్లభాష ఆధిపత్యం పెరగడంతో తెలుగు ప్రాభవం బాగా తగ్గుతోంది. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన ఈ తరుణంలో ఓ ప్రైవేటు స్కూలులో జరిగిన ఘటన తెలుగు భాషా ప్రేమికులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
తేనెలొలుకు భాషగా తెలుగు గురించి ఘనంగా చెప్పుకుంటాం. ఈ భాషలోని మాధుర్యాన్ని, కమ్మదనాన్ని గుర్తించిన ఓ విదేశీ వర్తకుడు తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా వ్యవహరించారు. దీన్ని బట్టే తెలుగు భాష గొప్పదనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే నానాటికీ తెలుగు తన ఉనికిని కోల్పోతోంది. ఇంగ్లీషులో విద్యాబోధన పెరగడం, ఉద్యోగ రంగం సహా దాదాపుగా అన్నింటా అన్యభాషైన ఆంగ్లానిదే పెత్తనంగా మారింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లోనూ నెటిజన్స్ తెలుగును ఇంగ్లీషులో టైప్ చేస్తుండటం గమనార్హం. తెలుగు చదివేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని భాషావేత్తలు అంటున్నారు.
మాటల్లోనూ ఇంగ్లీషు పదాలు ఎక్కువగా వాడుతున్నారు తప్ప పూర్తిగా తెలుగులో మాట్లాడేవారిని వేళ్లమీద లెక్కపెట్టాల్సిన పరిస్థితి. ఘనమైన వారసత్వం కలిగిన తెలుగు భాష పరిరక్షణ కోసం అందరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని భాషాపరిరక్షకులు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో తెలుగుకు సంబంధించి వైరల్ అవుతున్న ఓ పోస్టు కలకలం రేపుతోంది. ఒక కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూలులో విద్యార్థులు తెలుగులో మాట్లాడకుండా నిషేధించినట్లు బోర్డును ఏర్పాటు చేశారు. దీనిని ఓ ఐపీఎస్ అధికారి ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇది చూస్తే, మన తెలుగును ఐసీయూలో పెట్టి చావును పరిచయం చేస్తున్నట్లుగా ఉందంటూ ట్వీట్ చేశారు.
‘ఏ సంస్కృతి వారయినా, కథలో, కళలో, కాజానో, మాకు మాత్రమే ప్రత్యేకమని చాటుకుంటారు. శత్రువులెక్కడో ఉండరు’ అని ఆ ట్వీట్కు క్యాప్షన్ చేశారు. ఆ ట్వీట్లో పోస్టు చేసిన బోర్డులో TELUGUకి బదులు TELGU అని తప్పుగా రాశారు. ఈ పోస్టుపై నెటిజన్స్ సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి మైండ్సెట్ నుంచి బయటకు రావాలంటున్నారు. మాతృభాష అంటే పడిచచ్చే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి బోర్డులు పెట్టగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై తెలుగువాళ్లు ఐకమత్యం కావాలని సూచిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది చూస్తే , మన తెలుగును ఐసీయు లో పెట్టి చావును పరిచయం చేస్తున్నట్లుగా లేదూ ? ఏ సంస్కృతి వారైనా, కథలో, కళలో, కాజానో, కలంకారో, మాకు మాత్రమే ప్రత్యేకమని చాటుకుంటారు. మన బెంట్ అఫ్ మైండు లో భాష బెండు కాస్త ఎక్కువే నేమో. మాటల మాంత్రికుడన్నట్టు, శత్రువులెక్కడో ఉండరు…@Trivikramwriter pic.twitter.com/RgBKzFAnlV
— Ramesh Masthipuram (@rameshmasthi) February 22, 2023