నేటి కాలంలో ఆస్పత్రికి వెళ్లాలంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రలు మీద నమ్మకం లేదు.. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే అప్పుల పాలవ్వాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆస్పత్రి ఒక్క రూపాయికే వైద్యం అందిస్తోంది. ఆ వివరాలు..
నేటి కాలంలో మనుషులు భయపడేది ఒక్క దానికే. బతికినంత కాలం ఆరోగ్యంగా బతికి.. ఆస్పత్రిలో చేరకుండా కన్ను మూయాలని కోరుకుంటారు. నేటి కాలంలో ఆస్పత్రిలో చేరడం అంటే.. ఉన్న ఆస్తులను అమ్ముకోవడంం అన్నట్లుగా మారింది పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు తక్కువ.. వైద్యుల కొరత. అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితలుకు భయపడే చాలా మంది అప్పుల చేసైనా సరే.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తారు. సాధారణ జ్వరం వచ్చి.. కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే.. మనల్ని భయపెట్టి.. రకరకాల టెస్ట్లు చేసి.. ఓ పది వేల రూపాయల బిల్లు వసూలు చేసి పంపిస్తారు. ఇక కన్సల్టెన్సీ ఫీజే వేయి రూపాయిల వరకు వసూలు చేస్తారు. ప్రాణం విషయం కాబట్టి ఎంతైనా ఖర్చు చేస్తారు అనే దాని మీద ఆధారపడి కార్పొరేట్ ఆస్పత్రులు నడుస్తుంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో.. వైద్యం అంటే సామాజిక బాధ్యత.. అనే విషయాన్ని బలంగా నమ్ముతూ.. ఆచరిస్తూ.. ఎందరికో సంజీవనిలా నిలుస్తోంది ఓ కార్పోరేట్ ఆస్పత్రి. సామాన్యులకు కేవలం ఒక్క రూపాయితోనే కార్పోరేట్ వైద్య సేవలు అందిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. మరి ఈ ఆస్పత్రి ఎక్కడి ఉంది అంటే మన హైదరాబాద్, పంజాగుట్టలోనే. ఆ ఆస్పత్రి ఏదంటే.. మురుగన్ హాస్పిటల్. సేవా దృక్పథంతో నెలకొల్పిన మురుగన్ హాస్పిటల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఒక్క రూపాయికే పేదలకు కార్పొరేట్ వైద్యం దక్కాలన్న మంచి సంకల్పంతో యాజమాన్యం ఓపీ ఛార్జీని అంటే డాక్టర్ కన్సల్టేషన్ ఫీజును కేవలం ఒక్క రూపాయిగా నిర్ణయించి.. పేదల పాలిట సంజీవనిగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు సుమారు 25 వేల మందికి పైగా రోగులకు ఒక్క రూపాయికే వైద్య సేవలు అందించినట్లు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది.
ఇక ఈ ఆస్పత్రిలో కేవలం ఓపీ సేవలే కాకుండా.. సర్జరీలు, ఇతర చికిత్సలు అవసరమైన వారికి కూడా తక్కువ ఖర్చుతోనే అందిస్తూ.. పేదల పాలిటి సంజీవనిగా నిలుస్తోంది ఈ ఆస్పత్రి. వైద్యం అందించటం ఒక బిజినెస్గా కాకుండా కేవలం సేవా భావంతోనే మురుగన్ ఆస్పత్రిని స్థాపించినట్టు చెబుతున్న వైద్యులు.. కేవలం అవుట్ పేషంట్ల విషయంలోనే కాకుండా ఇన్ పేషంట్లకు కూడా అతి తక్కువ బిల్లులు ఉంటాయని చెబుతున్నారు. నిమ్స్ లాంటి సెమీ అటానమస్ బాడీ ఉన్న ఆస్పత్రుల్లో ఎంత బిల్లు అవుతుందో అంతే ఖర్చు మురుగన్ ఆస్పత్రిలో అవుతుందంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆస్పత్రిలో సేవలందిస్తోన్న డాక్టర్ రవికుమార్ తెలిపారు.
ప్రసుత్తం ఈ ఆస్పత్రిలో 150 బెడ్లు ఉన్నాయి. అన్ని రకాల అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చిన రోగి.. రిసెప్షన్లో ఎంత డబ్బు చెల్లించారు అనే దానితో సంబంధం లేకుండా.. అతడికి ఉన్న సమస్య ఏంటీ.. దానికి ఎలాంటి వైద్యం అందించాలని మాత్రమే తాము ఆలోచిస్తామంటున్నారు ఈ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులు. మరోవైపు.. కన్సల్టేషన్ ఫీజు ఒక్క రూపాయి అని పెట్టి.. మిగతా టెస్టులు, మందుల పేరుతో ఎక్కువ వసూలు చేస్తారని ఉన్న అపోహను తొలిగిస్తూ.. మిగతా పరీక్షలకు 25 శాతం, మందులపై 10-15 శాతం డిస్కౌంట్లు కూడా ఇస్తున్నట్టు చెబుతున్నారు ఈ ఆస్పత్రి యాజమాన్యం. మరి మురగన్ ఆస్పత్రి అందిస్తోన్న సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.