ఈరోజు ఏ పెళ్ళిలో చూసినా ప్లాస్టిక్ కంచాలు, ప్లాస్టిక్ గలాసులు, రసాయనాలతో పండించిన ఆహారంతో వండిన వంటకాలు వడ్డింపులు.. ఇవి తింటే ఇక అంతే సంగతులు. ఈరోజుల్లో పెళ్లి అంటే మాకు ఇంత ఉంది అని చూపించుకోవడానికే చేసుకుంటున్నారేమో అనిపిస్తుంటుంది. అయితే మాకు ఇంత ఉంది అని చెప్పుకోవడం కంటే ప్రకృతి పట్ల, మనుషుల పట్ల ప్రేమ, బాధ్యత ఇంత ఉంది అని చెప్పుకునేలా పెళ్లిళ్లు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఒక రైతు ఉన్నారు.
వివాహాలు అంటే విందు మాత్రం అదిరిపోవాల్సిందే. బూరెలు, కాజా, అప్పడం, పప్పు, కూర, రసం, సాంబారు, అన్నం, పులావు అబ్బో చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు ఉంటుంది. వచ్చిన వాళ్ళు కడుపు నిండా తిని మనసు నిండా నూతన వధూవరులను దీవిస్తారని విందులో అన్ని రకాల పదార్థాలు వడ్డిస్తారు. పెళ్లి అంటే మినిమమ్ ఉండాలని విందులో మాత్రం ఖర్చుకి వెనకాడరు. అయితే ఎంత ఖరీదైన విందు అయినా అది ఆర్గానిక్ ఫుడ్ కాకపోతే విషంతోనే సమానం. ఒక్కో ఆకుకి 500, 1000 ఖర్చు పెట్టినా కూడా పెళ్ళికి వచ్చిన అతిథులకు విషం వడ్డించినట్టే. కానీ తన కూతురు పెళ్ళికి వచ్చే అతిథులు విషం తినకూడదని భావించి ఓ రైతు అమృతాన్ని వడ్డించారు.
రసాయనాలు, పురుగుల మందులతో పండించిన ఆహారాన్ని కాకుండా.. సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసిన పంటల ఉత్పతులతో వండించి అసలు సిసలు విందుని ఏర్పాటు చేశారు. ఆయనే మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన రాజనరసింహ. నిజంగా ఆయన రాజే. 2వేల మందికి మూడు లక్షలు ఖర్చు పెట్టి ఈ ప్రకృతి సిద్ధమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. రసాయనాలు, పురుగుల మందులతో పండించిన ఆహార ఉత్పత్తులను వడ్డిస్తే పెళ్ళికి వచ్చిన వారికి అనారోగ్యాన్ని వడ్డించినట్టు అవుతుందని.. అసలు దాని జోలికే పోలేదు. కడుపు నిండా రుచికరమైన, శుచికరమైన, ఆరోగ్యవంతమైన భోజనం తిని మనసు నిండా తన కూతురిని, అల్లుడిని దీవించాలని అతిథుల కోసం లక్షలు ఖర్చు పెట్టి మరీ సేంద్రీయ పద్ధతిలో భోజన ఏర్పాట్లు చేశారు. గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో వివాహ భోజనం ఏర్పాటు చేశారు. ప్రకృతి సాగు ద్వారా పండించిన బియ్యంతోనే వివిధ వంటలు చేశారు.
పప్పులు, బియ్యం, నూనెలు అన్నీ సేంద్రీయ పద్దతిలో పండించినవే వంటల్లో వాడారు. గానుగ నూనెను వంట నూనెగా ఉపయోగించారు. అంతేకాదు కూల్ డ్రింకులు బదులు చల్లని చెరకు రసాన్ని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ ప్రస్తావన, రసాయనాల ప్రస్తావన లేకుండా పూర్తిగా ప్రకృతి వనరులతోనే సహజసిద్ధ పద్ధతుల్లో విందు ఏర్పాటు చేశారు. అరిటాకుల్లోనే భోజనం వడ్డించారు. ఆవు పాలు, ఆవు పెరుగు వాడారు. ప్రకృతిని కాపాడాలనే హానికర వస్తువులను వాడలేదని రాజనరసింహ అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సేంద్రీయ ఉత్పత్తులనే వాడాలని, ఆరోగ్యంగా ఉండాలని చెబుతున్నారు. అతిథులు కూడా వంటలు చాలా రుచిగా ఉన్నాయని చెబుతున్నారు. మరి సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన పదార్థాలతోనే విందు భోజనం ఏర్పాటు చేసిన ఈ సేంద్రీయ రైతుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.