కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఇంటిపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ అంబర్పేటలోని ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అంబర్పేట పోలీసులు వీహెచ్ ఇంటికి చేరుకొని.. దాడి జరిగిన తీరును పరిశీలించారు.
సీసీ కెమెరాల ఆధారంగా నిందితులని గుర్తించే పనిలో పడ్డారు. దాడి సమయంలో వీహెచ్ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. అయితే దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిందన్న సమాచారంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని పరామర్శిస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు.
ఈ సందర్భంగ వీహెచ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కొంత కాలంగా క్రైమ్ పెరిగిపోతుందని.. తమలాంటి సీనియర్ నేతలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు పలు సందర్భాల్లో బెదిరింపు కాల్స్ వచ్చాయని డీజీపీకి ఫిర్యాదు చేసినప్పట్టికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పటికైనా దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.