తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆమె కరీంనగర్ కలెక్టర్ గా చేసి ఎంతో గొప్ప పేరు సంపాదించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి నియమితులైనారు. తాజాగా స్మితా సబర్వాల్ కి హై కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె ఇటీవల ఫేమ్ మ్యాగజన్ అయిన అవుట్ లుక్ పై కేసు వేశారు. ఈ కేసు విషయంలో ఆమెకు చుక్కెదురైంది.
2015 లో హైదరాబాద్లోని ది పార్క్ హోటల్లో ప్రముఖ డిజైనర్ అభిషేక్ దత్తా ఒక ఫ్యాషన్ షో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ షోలో పలువురు సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన భర్త, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ తో కలిసి ర్యాంప్ షో చేశారు. ఫ్యాషన్ షో లో పాల్గొన్న ఫోటోలు ఆ సందర్భాన్ని అభ్యంతరకరమైన క్యారికేచర్ అవుట్లుక్ ఆంగ్ల వారపత్రికలో ప్రచురించింది.
స్మితా సబర్వాల్ ర్యాంప్ షో పై నో బోరింగ్ బాబు అనే శీర్షిక తో ఓ కథనాన్ని క్యారికేచర్ను ప్రచురించింది. దీంతో ఆమెపై కొంత మంది రక రకాలుగా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్.. అవుట్లుక్పై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఆమెకు తెలంగాణ సర్కార్ లో కొంత మంది మద్దతు పలికారు. ఈ క్రమంలో నిధులు విడుదల చేయాలని స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఖర్చుల నిమిత్తం పదిహేను లక్షలు వరకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.
ఒక ప్రైవేట్ కేసు విషయంలో ప్రభుత్వం ఎలా డబ్బులు మంజూరు చేస్తారన్న విషయంపై హై కోర్టులో వేరు వేరుగా మూడు పిర్యాదులు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ప్రభుత్వ సొమ్మును స్మితా సబర్వాల్ కి పర్సనల్ కేసు విషయంలో ఎలా విడుదల చేస్తారన్ని విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాదు ప్రైవేట్ వ్యక్తి ప్రైవేటు సంస్థపై కేసు వేస్తే అది ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కాదని పేర్కొన్న హైకోర్టు ఆమెకు చెల్లించిన పదిహేను లక్షలు 90 రోజుల్లో తిరిగి చెల్లించాలని తెలిపింది. ఒకవేల ఈ విషయంలో ఆలస్యం జరిగితే ఆమె నుంచి నేరుగా వసూళ్లు చేయాలని తీర్పునిచ్చింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే కోర్టులు సమీక్షించవచ్చని చెప్పింది.