ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల కోనుగోలు కుట్ర సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత రెండు రోజుల నుంచి ఈ ఇష్యూ ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం అధికార టీఆర్ఎస్ , ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడను రాజేసింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటనలో ఓ ఆడియో బయటకొచ్చిన విషయం తెలిసిందే. అధికార పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భారతి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకి వచ్చింది. దీనిపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఆ ఆడియో ఉత్త బోగస్ అంటూ మీడియ ముందు వెల్లడించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యహారంలో ఉన్న వారితో తమకు ఏమి సంబంధంలేదని కిషన్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసలు పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ గ్రేట్ మాస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..”ఈ ఇష్యూతో మాకు సంబంధంలేదు. ఆ స్వామిజీతో మాకు సంబంధంలేదు. ఆడియోలో ఎక్కడ డబ్బులు విషయం రాలేదు. అందులో పార్టీలో చేరిక విషయం మాత్రమే వచ్చింది. అందులో పెద్ద వింత ఏం ఉంది? పార్టీలో చేరడం కొత్తనా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల టీఆర్ఎస్ లో చేరలేదా? అంతక ముందు బీఎస్పీ, వైఎస్సాఆర్ సీపీ, టీడీపీ పార్టీల వాళ్లను చేర్చుకోలేదా?. ఇటీవల కేటీఆర్ బీజేపీ పార్టీల వారిని చేరమని అడగలేదా?. ఇందులో ఏముందని మీడియా మిత్రులు తొందరపడుతున్నారో నాకు అర్ధం కావడంలేదు.
ఆ వీడియోలో మాట్లాడిన మాటలతో మాకేమి సంబంధం లేదు. వారు సంభాషించుకున్న మాటలతో మాకు ఏమి సంబంధం లేదు. ఈ విషయంలో ప్రభుత్వమే వెనక్కి తగ్గింది. మీడియ వారు మాత్రమే తొందర పడుతున్నారు. పార్టీలో చేర్చుకోవడం తప్పేముంది. స్వాతంత్రం వచ్చినప్పుటి నుంచి ఎందరో పార్టీలు మారారు. ఎన్నో పార్టీలు చేర్చుకున్నాయి. కొందరు అన్నట్లు 100 కోట్లు ఉన్నట్లు అయితే వాటిని వెంటనే చూపించాలి. 100 కోట్లు కాదు వెయ్యి కోట్లు ఉన్న మాకేమి సంబంధం?. ఇక మునుగోడు ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని చెప్పాము. వాటికి వేరే మాటలు జోడించవద్దు” అని తెలిపారు. ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారం పై న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీలకు పార్టీలను టీఆర్ఎస్ లో ఎలా కలుపుకుందో ప్రజలు అందరికి తెలుసన్నారు.