గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనల గురించి ఈమధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. తుప్పుపట్టిన సిలిండర్లను మళ్లీ మళ్లీ వాడుతుండటం, గ్యాస్ లీకేజీలు, ఇతరత్రా కారణాల వల్ల ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. సిలిండర్ బాగుందా, పేలిపోయే ప్రమాదం ఉందా అనేది వినియోగదారులకు తెలియదు. ఆర్డర్ చేసిన సిలిండర్ వచ్చినప్పుడు హడావుడిలో తీసుకుంటారు, తప్పితే మిగిలిన విషయాలను కస్టమర్లు అంతగా పట్టించుకోరు. ఇక సిలిండర్లపై నాణ్యతా పరీక్షలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో కూడా తెలియదు. ఇదిలాఉంటే.. మెదక్ జిల్లా, చేగుంట మండలం చిన్న శివునూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.
హైదరాబాద్లో నివాసం ఉంటున్న అంజమ్మ అనే వృద్ధురాలు పెన్షన్ తీసుకునేందుకు గానూ మెదక్లోని తన సొంతూరు శివునూరుకు వెళ్లింది. ఆమె వెంట మనవరాలు మధు కూడా ఉంది. శివునూరుకు చేరుకున్నాక రాత్రి భోజనం చేసి వీళ్లిద్దరూ నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి 3 గంటల సమయంలో వాళ్ల ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో క్షణాల్లో ఇల్లంతా మంటలొచ్చేశాయి. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం కాగా.. అంజమ్మ, ఆమె ఆరేళ్ల మనవరాలు మధు చనిపోయారు. వీళ్ల మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.