పుష్కర కాలం అనంతరం తిరిగి భారత్ లో ప్రపంచ సమరం జరుగనుండటంతో.. టీమ్ఇండియాను అంతా ఫేవరెట్ అని భావిస్తుంటే.. యువీ మాత్రం ఈ సారి భారత జట్టు కప్పు కొట్టడం కష్టమే అని అభిప్రాయపడ్డాడు.
మరో మూడు నెలల్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. ఇప్పటి నుంచే ఊహగానాలు ఊపందుకుంటున్నాయి. ఫలానా జట్టు ఫేవరెట్ అని ఒకరంటే.. అంత సీన్ లేదని ఇంకొకరు. ఆ ప్లేయర్ కచ్చితంగా రాణిస్తాడని ఒకరు విశ్లేషిస్తే.. ఈ ఆటగాడిని చూడటం మరవకండి అని మరొకరు సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత మాజీ ఆల్ రౌండర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్ లో తన విధ్వంసక బ్యాటింగ్ తో తొలి సారే టీమ్ఇండియా విశ్వ విజేతగా నిలువడం లో కీలక పాత్ర పోషించిన యువారజ్.. 2011 వన్డే వరల్డ్ కప్ లో జట్టు విజయానికి తన కర్త ధారపోశాడనే విషయం తెలిసిందే. క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడుతున్నా.. ఏమాత్రం వెరువకుండా.. అటు బ్యాట్ తో ఇటు బంతితో సత్తాచాటి.. జట్టు రెండో సారి టైటిల్ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
పుష్కర కాలం అనంతరం తిరిగి భారత్ లో ప్రపంచ సమరం జరుగనుండటంతో.. టీమ్ఇండియాను అంతా ఫేవరెట్ అని భావిస్తుంటే.. యువీ మాత్రం ఈ సారి భారత జట్టు కప్పు కొట్టడం కష్టమే అని అభిప్రాయపడ్డాడు. గత వరల్డ్ కప్ (2019)లో రికార్డు స్థాయిలో 5 శతకాలతో విశ్వ రూపం కనబర్చిన రోహిత్ శర్మ ఈ సారి జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అయితే ప్రధాన ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతుండటే టీమ్ఇండియాకు చేటు చేస్తుందని యువీ అన్నాడు. ‘రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా గాయాలతో బాధ పడుతున్నారు. దీంతో మిడిలార్డర్ లో అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఈ సారి టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్ గెలుస్తుందనన్న నమ్మకం నాకు లేదు. భారత్ లో మెగాటోర్నీ జరుగుతుండటంతో భారీ అంచనాలు ఉంటాయి. సరైన కూర్పు కుదరకపోతే ఎంతటి జట్టైనా పరాజయం పాలవుతుంది’ అని యువరాజ్ పేర్కొన్నాడు.
2019 ప్రపంచకప్ సమయంలోనూ భారత జట్టు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగల సమర్థ ఆటగాడు లేక తీవ్రంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, విజయ్ శంకర్ ఇలా ఎందరినో పరిక్షించి మూల్యం చెల్లించుకుంది. ప్రస్తుతం ఆ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కుదురుకున్నట్లు కనిపించినా.. గాయం కారణంగా అతడు అందుబాటులో లేడు. ‘టాపార్డర్ లో రోహిత్, గిల్, కోహ్లీ రూపంలో ముగ్గురు గ్రేట్ బ్యాటర్లు ఉన్నారు. మిడిల్ ఆర్డర్ తోనే సమస్య. రింకూ సింగ్ చాలా బాగా ఆడుతున్నాడు. అతడికి అవకాశం ఇవ్వాలనుకుంటే.. ప్రపంచకప్ నకు ముందు తగినన్న మ్యాచ్ ల్లో అవకాశాలు కల్పించాలి. వరల్డ్ కప్ వంటి మెగాటోర్నీ కోసం ఏ జట్టైనా 20 మందిని సిద్ధంగా ఉంచుకోవడం ముఖ్యం’ అని యువీ చెప్పుకొచ్చాడు. మరి భారత జట్టు స్వదేశంలో వన్డే ప్రపంచకప్ గెలువడం కష్టమే అన్న యువరాజ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.