క్రికెట్ లో ఏ ఫార్మాట్ అయినా సరే ఓ మ్యాచ్ లో ఓపెనర్ అనేవాడు అద్భుతమైన శుభారంభం ఇవ్వాలి. అప్పుడే జట్టు స్కోరు రాకెట్ స్పీడుతో దూసుకుపోతుంది. ప్రత్యర్థికి భారీ టార్గెట్ ఇస్తుంది. పాక్ జట్టు విషయంలో మాత్రం ఇది జరగలేదు. టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఆ జట్టు అడుగుపెట్టేసింది కానీ ఓపెనర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ బాబర్ ఆజామ్ తో పాటు మరో ఓపెనర్ రిజ్వాన్ ఘోరాతి ఘోరంగా ఫెయిలవుతూనే ఉన్నాడు. ఈ విషయమై ఆ దేశ మాజీ క్రికెటర్లే తిడుతున్నారు. ఇంకా చెప్పాలంటే టీమిండియా క్రికెటర్ల బ్యాటింగ్ చూసి నేర్చుకోమని సలహాలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ లో పాక్ మంచి అంచనాలతో అడుగుపెట్టింది. కానీ టీమిండియా, జింబాబ్వేతో వరస మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఓపెనర్లు పూర్తిగా తేలిపోయారు. సూపర్-12లోని ఐదు మ్యాచుల్లో కలిపి రిజ్వాన్ 103 పరుగులు చేయగా, బాబర్ అయితే మరీ దారుణంగా 39 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు టీమిండియాలో రోహిత్ ఓ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టగా.. మిగతా వారిలో కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ ప్రతి మ్యాచ్ లోనూ చెలరేగి ఆడుతున్నారు. జింబాబ్వేతో గత మ్యాచ్ లో సూర్య కుమార్ బ్యాటింగ్ గురించి ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఇక ఇదే విషయాన్ని పాయింట్ అవుట్ చేసిన అఫ్రిది.. సూర్య కుమార్ ని చూసి నేర్చుకోవాలని రిజ్వాన్ కి కౌంటర్లు వేశాడు. ‘దేశవాళీ క్రికెట్ లో సూర్య 200-250 మ్యాచులకు పైగానే ఆడాడు. దీంతో అతడికి ఆటపై పూర్తి అవగాహన ఉంది. అంతర్జాతీయ మ్యాచ్ ల గురించి బాగా తెలుసుకునే వచ్చాడు. మంచి బంతుల్ని ఫెర్ఫెక్ట్ గా బౌండరీలు కొడుతున్నాడు. టీ20 ఫార్మాట్ లో బ్యాటర్ అనేవాడికి కావాల్సింది అదే. ఇక రిజ్వాన్ విషయానికొస్తే.. అన్ని జట్లు కూడా అతడికి మిడిల్ స్టంప్ పై బంతులు వేయకూడదని ప్లాన్ చేసుకున్నాయి. దీంతో అతడు ఆఫ్ సైడ్ ఆడే విషయంలో పూర్తిగా ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడైతే రిజ్వాన్ రిస్క్ తీసుకుని కొత్త షాట్లు ఆడాలి. మిడ్ ఆఫ్, ఎక్స్ ట్రా కవర్స్ లో షాట్స్ కొట్టడం బాగా ప్రాక్టీసు చేయాలి. అలానే సూర్య కుమార్ ని చూసి బ్యాటింగ్ నేర్చుకోవాలి’ అని అఫ్రిది చెప్పాడు. ఇదిలా ఉండగా పాక్.. నవంబరు 9న జరిగే సెమీస్ మ్యాచులో న్యూజిలాండ్ తో తలపడనుంది. మరో మ్యాచులో భారత్-ఇంగ్లాండ్ తలపడనున్నాయి.