మేడ్చల్- కొందరు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడమే కాదు, మహిళల పట్ల అమానుషంగా కూడా ప్రవర్తిస్తుంటారు. ప్రభుత్వ పధకాల మంజూరు కోసం వచ్చిన వాళ్లను లొంగదీసుకోవాలని కుట్ర పన్నుతుంటారు కొంతమంది దుర్మార్గులు. ఇదిగో ఇక్కడ తండ్రి పింఛను తనకు మంజూరు చేయాలని కోరుతూ ట్రెజరీ కార్యాలయానికి వచ్చిన ఓ యువతిని తనకున్న అధికారంతో లోబరచుకోవాలని అనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు.
సదరు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్రంగా ప్రతిఘటించి తప్పించుకుంది. ఈ ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన మేడ్చల్ ట్రెజరీ కార్యాలయం లో జరిగింది. నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యి పింఛనును తీసుకుంటున్నారు. అయితే ఇటీవల అనారోగ్యం కారణంగా అతడు చనిపోయాడు. అంతకు ముందే తల్లి కూడా చనిపోవడంతో ఆ యువతి ఎవరు లేని అనాథగా మారింది.
దీంతో తండ్రికి వచ్చే పింఛను తనకు మంజూరు చేయాలని కోరుతూ నాలుగు రోజుల క్రితం మేడ్చల్ ట్రెజరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. యువతిపై కన్నెసిన అదనపు ట్రెజరీ అధికారి తనతో సినిమాకు వస్తేనే పింఛను మంజూరు చేస్తానంటూ లైంగిక వేధింపులకు దిగాడు. కార్యాలయానికి వచ్చిన యువతిని అధికారు పవన్ కుమార్ బలవంతం చేయబోతే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో పవన్ కుమార్ అక్కడ్నుంచి మెల్లగా పారిపోయాడు.
జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు, టీఆర్ఎస్ నాయకులకు చెప్పగా సదరు అధికారికి, యువతికి మధ్య రాజీకి ప్రయత్నించారు. అంతే కాదు ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే సమయంలో ట్రేజరీ అధికారి పవన్ కుమార్ వాదన మరోలా ఉంది. యువతి పెళ్లి కాలేదని చెబుతూ పింఛను పొందాలని చూసిందని, నిబంధనల ప్రకారం ఆమె దరఖాస్తును తిరస్కరించి రికవరీకి ఆదేశాలివ్వడంతోనే ఆమె తనపై కక్ష్య గట్టి లేనిపోని ఆరోపణలు చేస్తోందని చెబుతున్నాడు.