కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం కలవరపడుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికై ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తుంది. భారతదేశం లో కరోనా వ్యాప్తి నివారణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. కరోనా మహమ్మారి పోరులో వైద్య బృందాలు, పోలీస్ శాఖ, పారిశుధ్య సిబ్బంది అహర్నిశలూ శ్రమిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఆయన మరో సినిమా చేయబోతున్నారని సినీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందే రాజమౌళి మరో సినిమా చేస్తారా? అనే సందేహం రాక మానదు. అయితే రాజమౌళి చేయబోయేది ఫీచర్ ఫిల్మ్ కాదు షార్ట్ ఫిల్మ్ అని సమాచారం. కొవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా, ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ గొప్పతనాన్ని తెలియజేసేలా రాజమౌళి షార్ట్ ఫిల్మ్ను రూపొందించనున్నారు.
ఈ షార్ట్ ఫిల్మ్ వివరాలను పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయడం, వారు ఓకే చెప్పడం జరిగాయి. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయిన సమయంలో రాత్రనక, పగలనక సేవలందిస్తున్న డాక్టర్స్, పోలీస్, పారిశుధ్య సిబ్బంది కి అభినందనలు అని, పోలీస్ ల గొప్పతనాన్ని వివరిస్తూ ఒక మూవీ నిర్మించాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని జక్కన్నతెలిపారు. 19 నిమిషాల వ్యవధితో దర్శకధీరుడు పోలీసులపై చేయనున్న షార్ట్ ఫిల్మ్ గురించి త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.