చెన్నై- తమిళ హీరో సిద్ధార్థ్ గుర్తున్నాడా.. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యాడు. కొన్నాళ్లు సినిమాలు లేక కాస్త డల్ అయినా.. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగా మారుతున్నాడు సిధ్దార్ధ్. అందుకు అనుగునంగానే ఇటీవల సిద్దార్థ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. కరోనా సమయంలో సిద్ధార్థ్ పలు సందర్భాల్లో జనాన్ని చైతన్య పరిచేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ప్రధాని మోడీని, బీజేపీ ప్రభుత్వాంపై విమర్శిలు గుప్పిస్తూ వస్తున్నాడు. ఐతే బీజేపీపై విమర్శలు చేసినందుకు ఆ పార్టీ నేతలు తనపై కక్ష్య గట్టారని సిద్దార్ధ్ ఆరోపిస్తున్నాడు. తనకు, తన కుటుంబానికి 24 గంటల్లో 500కు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెబుతున్నాడు సిద్దార్ధ్. కుటుంబ సభ్యులను అత్యాచారం చేసి చంపెస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. అన్ని నెంబర్లు రికార్డ్ చేసి పోలీసులకు ఇవ్వనున్నట్లు సిద్దార్ధ్ చెప్పాడు.
తాను నోరు మూసుకుని కూర్చోనని, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటానని నరేంద్ర మోదీ, అమిత్ షాను సైతం ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన అసమ్మతిని వ్యక్తం చేశాడు. ఇక తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధించి ఓ స్క్రీన్ షాట్ని చూపిస్తూ.. కొవిడ్ నుంచి బయటపడగలం కానీ, ఇలాంటి వాళ్లతో ఏం మాట్లాడగలం అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తమిళనాడు బీజేపీ సభ్యులే తనను టార్గెట్ చేశారని, తన ఫోన్ నెంబర్ లీక్ చేసి, తనపై దాడికి కొంతమందిని ఉసి గొలుపుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు సిద్దార్ధ్. ఐతే బీజేపీ నేతలు మాత్రం సిద్దార్ధ్ ఆరోపణల్ని కొట్టిపారేశారు.