సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా కొంతమంది మాత్రం ఇంకా ఈజీ మనీ కోసం మహిమలపై ఆధారపడుతున్నారు. ఇలాంటి వారి మూఢనమ్మకం, అత్యాశ మోసగాళ్లకు వరంగా మారుతోంది. కొంతమంది మోసగాళ్లు అమాయకులను అడ్డంగా ముంచేస్తున్నారు. బ్లఫ్ మాస్టర్ సినిమాలో చూపించినట్లు హీరో సత్యదేవ్ ఒక పెద్ద రాజకీయ నేతలకు మహిమ గల కళషం అనేది ఉందని, ఇది రైస్ పుల్లింగ్ చేసే అద్భుత శక్తి కలిగి ఉందని చూపించి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అచ్చం ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోకి విజయనగరంలో చోటుచేసుకుంది.
ఇద్దరు యువకులు తమ వద్ద రైస్ పుల్లింగ్ శక్తి ఉన్న మహిమ గల నాణెం ఉందని హైదరాబాద్కు చెందిన యువకులను నమ్మించారు. ఆ నాణేన్ని రూ.5 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. బుధవారం విజయనగరంలోని ఎస్ కోటలో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ యువకులు డబ్బులు తీసుకుని పొలాల్లో పడి పారిపోతుండగా.. అనుమానం వచ్చిన గ్రామస్తులు వారిలో ఒకడిని పట్టుకుని దేహశుద్ది చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ యువకుడిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. నకిలీ నాణేన్ని, నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.